-
ఫ్లోరోసిస్ కన్నీళ్లు ఆగాలంటే.. సాగునీటి కల సాకారం కావాల్సిందే!
-
తరతరాల ఫ్లోరైడ్ శాపం నుంచి విముక్తి ఎప్పుడు?..
-
శివన్నగూడెం రిజర్వాయర్పై ప్రజా యుద్ధం!
-
బిడ్డల భవిష్యత్తు కోసం.. భూముల పచ్చదనం కోసం.. మనమంతా ఒక్కటవుదాం!
-
రాజకీయాల కోసం కాదు.. మన జీవన హక్కు కోసం: ఇ.ఎల్.వి భాస్కర్ పిలుపు
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల ప్రజల దశాబ్దాల కల, తరతరాల కన్నీటి వ్యధ అయిన సాగునీరు, స్వచ్ఛమైన తాగునీటి సాధన కోసం *’ఈఎల్వీ ఫౌండేషన్’ అధినేత భాస్కర్* గళమెత్తారు. 20 ఏళ్లు చాలదా? ఇంకా ఎంతకాలం ఈ నిరీక్షణ?” అంటూ ఆయన సంధించిన ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. వందల ఏళ్ల ఫ్లోరైడ్ కష్టాలు, తరతరాల నిరీక్షణ, ఎన్నో పోరాటాలు జరిగినప్పటికీ, మన పొలాలకు సాగునీరు, మన బిడ్డలకు స్వచ్ఛమైన తాగునీరు అందాలనే, కల నేటికీ ఎందుకు సాకారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శివన్నగూడెం రిజర్వాయర్ విషయంలో జరుగుతున్న జాప్యం, మన ప్రాంత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని, ప్రస్తుత 436.40 మీటర్ల లెవల్ కొనసాగిస్తే, డిండి కాలువకు సరిపడా నీరు అందదని ఆయన సాంకేతిక అంశాలతో సహా వివరిస్తున్నారు.

రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని 440 మీటర్లకు పెంచితేనే, పంపింగ్ ద్వారా డిండి కాలువకు, తద్వారా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని, లేనిపక్షంలో నీటి ప్రవాహం తగ్గి, ఈ ప్రాంతం మళ్లీ ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది కేవలం రాజకీయాల కోసం చేస్తున్న పోరాటం కాదని, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన జీవన హక్కు కోసం చేస్తున్న యుద్ధమని భాస్కర్ స్పష్టం చేశారు. రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి ద్వారా నారాయణపురం, చౌటుప్పల్ వంటి ప్రాంతాలను సస్యశ్యామలం చేయవచ్చని, 2027 డిసెంబర్ నాటికి, ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
మన గళం వినిపిస్తేనే, అందరం కలిసికట్టుగా పోరాడితేనే ఈ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయని, స్వచ్ఛమైన నీటి కోసం, పచ్చని పొలాల కోసం ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో శివన్నగూడెం ప్రాజెక్ట్ పైలాన్ వద్ద, మీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన, మీడియాతో మాట్లాడారు. పోరాటం కోసం అందరూ సంసిద్ధం కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు..
