క్రైమ్ మిర్రర్ : పిఠాపురంలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నూకరాజు సూసైడ్ నోట్లో ప్రస్తావించిన సాధిక్ ఖాన్పై తాజాగా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నూకరాజు అల్లుడు జగదీశ్ రెడ్డి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. పిఠాపురంలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. తమ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులకు సాధిక్ అనే వ్యక్తే కారణమని నూకరాజు సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు అప్పట్లో పోలీసులు వెల్లడించారు. దీంతో సాధిక్ పేరు ఈ కేసులో కీలకంగా మారింది.
అల్లుడు జగదీశ్ రెడ్డి మృతిపై అనుమానాలు
ఇదిలా ఉండగా.. తన అల్లుడు జగదీశ్ రెడ్డి కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషయాన్ని నూకరాజు తన సూసైడ్ నోట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. జగదీశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఈ వ్యవహారంపై సర్పవరం పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడి మృతికి సాధిక్ ఖాన్ కారణమని, అతడే జగదీశ్ రెడ్డిని హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు
భాస్కర్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా సర్పవరం పోలీసులు సాధిక్ ఖాన్పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జగదీశ్ రెడ్డి మృతికి దారితీసిన పరిస్థితులు, అప్పటి ఘటనకు సంబంధించిన ఆధారాలు, నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. జగదీశ్ రెడ్డి మరణం నిజంగా హత్యేనా? ఆయన మృతికి గల అసలు కారణం ఏమిటి? ఈ ఘటనకు సాధిక్కు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలను పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read : ‘దిమాగీ నక్సల్స్’ అంటే ఎవరు? మోదీ వ్యాఖ్యలపై రిజిజు వివరణ.. మూడు వర్గాలు ఇవే!
