Minister Keerthana Assembly Oath Twist: తమిళనాడు అసెంబ్లీలో సోమవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి విజయ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మంత్రి కీర్తన ప్రమాణ స్వీకారం వాయిదా పడటమే.
అసలేం జరిగిందంటే?
అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి సభ్యుడు ప్రమాణ స్వీకారం సమయంలో ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా తీసుకురావాలి. ప్రొటెం స్పీకర్ ముందు ఆ సర్టిఫికెట్ను చూపించిన తర్వాతే ప్రమాణం చేయిస్తారు. కానీ, మంత్రి కీర్తన తన ఎలక్షన్ సర్టిఫికెట్ ను సభకు తీసుకురాకపోవడంతో ఆమె ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో సభలో కొద్దిసేపు ఆసక్తికర పరిస్థితి నెలకొంది. తరువాత అవసరమైన పత్రాలు సమర్పించిన ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాలతో అనుబంధం!
ఇక కీర్తన గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆమెకు తెలుగు రాష్ట్రాలతో కూడా మంచి అనుబంధం ఉంది. కీర్తన కుటుంబ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళ్లి అక్కడి విరుదునగర్ ప్రాంతంలో స్థిరపడ్డారు. అందుకే ఆమెను చాలామంది తెలుగమ్మాయిగా కూడా భావిస్తున్నారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు కీర్తన ఎన్నికల వ్యూహకర్తగా మంచి గుర్తింపు సంపాదించారు. తెలుగుదేశం పార్టీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచార సలహాదారుగా పనిచేశారు. రాజకీయ వ్యూహాలపై ఆమెకు ఉన్న పట్టు, మాట్లాడే తీరు, ప్రజలతో కలిసిపోయే స్వభావం వల్ల మంచి గుర్తింపు వచ్చింది.
ఈ ప్రతిభతోనే ఆమె టీవీకే అధినేత విజయ్ దృష్టిని ఆకర్షించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు శివకాశి నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు. తొలి ప్రయత్నంలోనే కీర్తన ఘన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మంత్రివర్గంలో కూడా చోటు సంపాదించడం ఆమె రాజకీయ ప్రయాణంలో పెద్ద మైలురాయిగా మారింది. 1996లో విరుదునగర్లో జన్మించిన కీర్తన ఐదు భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన ఆమె ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.