-
చిట్టి చెల్లెలు చిరునవ్వుల కోసం అన్నగా అలుపెరుగని పోరాటం
-
రూ.16 కోట్ల ఖరీదైన జోల్ జెన్ స్మా ఇంజెక్షన్ ప్రాణాలు కాపాడిన వైనం
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: కొన్ని నెలల క్రితం మీడియా- సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా… `సేవ్ పునర్విక.. పునర్వికను కాపాడుకుందాం..` అంటూ లక్షల హృదయాలు స్పందించాయి. చేతనైన సాయం చేశాయి. చేయలేని వారు ప్రార్థించారు. ఇంజెక్షన్ కోసం వెల్లువలా విరాళాలు వచ్చాయి.
ఇంకా చిన్నారి చిరునవ్వులు వెలగాలంటే 6 కోట్లు కావాలి..అప్పుడే అందింది మంత్రి నారా లోకేష్ రూపంలో ఆపన్నహస్తం. ఇంకా ఎంత అవసరమైతే అంతా తానే సమీకరిస్తానని, అన్ని విధాలా అండగా ఉంటానని పునర్విక తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి చిట్టి చెల్లెలు చిరునవ్వుల కోసం అన్నగా అన్నీ తానై వ్యవహరించిన నారా లోకేష్. పునర్వికకు పునర్జన్మను ప్రసాదించే చికిత్సకు సాయం అందించారు.
అరుదైన వ్యాధి…
అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ(SMA TYPE-1) వ్యాధితో బాధపడుతున్న పునర్వికకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండతో పునర్జన్మ లభించింది. ఇంజెక్షన్ ను అమెరికా నుంచి హైదరాబాద్ రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ చేసిన సాయంతో పునర్విక ప్రాణాలు నిలిచాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రెయిన్ బో పిల్లల ఆసుపత్రిలో ఈ ఉదయం మంత్రి నారా లోకేష్ సమక్షంలో వైద్యులు అమెరికా నుంచి తీసుకువచ్చిన జోల్ జెన్ స్మా అనే జీన్ థెరపీ ఇంజెక్షన్ ను చిన్నారికి ఇచ్చారు.
అనంతరం మంత్రి లోకేష్.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఏడుస్తుండటంతో కొద్దిసేపు ఎత్తుకుని లాలించారు. చిన్నారిని కాపాడటం తన బాధ్యత అని, అన్ని విధాలా అండగా ఉంటానని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఒక్కటే మార్గం..
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడాది వయసున్న పునర్విక ప్రాణాంతకమైన వెన్నెముక కండరాల క్షీణత అనే వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి తండ్రి జంపాల మంగళ సురేష్ కుమార్ క్షవర వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పునర్విక జన్మించి ఆరు నెలలలైనా శరీరం కదిలించకపోవడంతో కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు.
కర్నూలు వైద్యుల సలహా మేరకు చిన్నారిని హైదరాబాద్ లోని రెయిన్ బో చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. పునర్వికకు అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ సోకిందని, చిన్నారిని రక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం రూ.16 కోట్ల ఖరీదైన జోల్ జెన్ స్మా అనే ఒకసారి మాత్రమే ఇచ్చే జీన్ థెరపీ ఇంజెక్షన్ అని వైద్యులు తెలిపారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్
ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు సురేష్ కుమార్, పుష్పావతి ఈ ఏడాది జనవరి నుంచి దాతల సాయం కోరారు. పునర్వికను కాపాడాలంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిఒక్కరూ స్పందించి మానవత్వం చాటుకున్నారు. ఫిబ్రవరి నాటికి విరాళాల ద్వారా రూ.10 కోట్ల వరకు సమకూరాయి.
సాయం కోసం ఎక్స్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను విజ్ఞప్తి చేశారు. ఆపదలో అండగా నిలిచే మంత్రి నారా లోకేష్.. పునర్విక ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే స్పందించారు. పునర్విక బాధ్యత తీసుకుంటానని, చిన్నారిని కాపాడతామని హామీ ఇచ్చారు. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
