Kharge Targets Modi: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై తీవ్ర విమర్శలు చేశారు. సమానత్వం, న్యాయం వంటి విలువలను ప్రధాని మోదీ, ఆయన పార్టీ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అలాంటి పార్టీలతో చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు.
మోదీ ఉగ్రవాది అని అనలేదు!
అయితే, మోదీని ఉగ్రవాది అని సంభోదించారని వచ్చిన ఆరోపణలను ఖర్గే ఖండించారు. తాను ఆ పదం ఉపయోగించలేదని, కేంద్ర సంస్థలు వంటి ఐటీ, ఈడీ ద్వారా ప్రతిపక్షాలను భయపెడుతున్నారని మాత్రమే అన్నానని స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాల్లో ప్రజలకు మోదీ ప్రభుత్వం పెద్దగా ఉపయోగం చేయలేదని విమర్శించారు. తమిళనాడు ప్రజలు కాంగ్రెస్-డీఎంకే కూటమికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
ఖర్గే క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ
ఇక ఖర్జే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలు అసభ్యకరమని, దేశ ప్రజలతో పాటు ప్రధానిని అవమానించారని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ అన్నారు. వెంటనే ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాహుల్ గాంధీ, స్టాలిన్ కూడా ఈ విషయంలో స్పందించాలని కోరారు. ఈ అంశంపై బీజేపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తూ, ఖర్గే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా అభిప్రాయపడింది.