Pinarayi Vijayan Remove ‘CM’ Title: కేరళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభానికి ముందు ఆయన తన సోషల్ మీడియా ప్రొఫైల్లో ‘ముఖ్యమంత్రి’ అనే పదాన్ని తొలగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం స్థానంలో ‘సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు’ అని మార్చారు.
విపక్షాల విమర్శలు
పినరయి నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి ఖాయమని ముందే అంచనా వేసి సీఎం హోదాను తొలగించారని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే దీనికి లెఫ్ట్ పార్టీ నేతలు భిన్నంగా స్పందించారు. ఫలితాలు వెలువడబోతున్న సమయంలో అధికార హోదాను ప్రొఫైల్లో ఉంచడం కంటే రాజ్యాంగ పరమైన సంప్రదాయాలను గౌరవించడం ముఖ్యమని, అందుకే విజయన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వారు వివరణ ఇచ్చారు. ఇది ఆయన హుందాతనానికి నిదర్శనమన్నారు. విపక్షాలు అవసరం లేని రాజకీయ విమర్శలు చేస్తున్నాయని కూడా అన్నారు.
విజయన్ గరించి..
ఇక ఎన్నికల విషయానికి వస్తే, పినరయి విజయన్ వరుసగా మూడోసారి ధర్మదం నియోజకవర్గం నుంచి గెలుపు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయనకు ప్రధాన పోటీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి వీపీ అబ్దుల్ రషీద్ నుంచి ఉంది. అలాగే బీజేపీ తరఫున కె. రణ్జీత్ కూడా బరిలో ఉన్నారు. 2016 మరియు 2021 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి విజయన్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే?
ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే, ఈసారి కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు అనుకూలంగా ఫలితాలు రావచ్చని చాలా సర్వేలు సూచిస్తున్నాయి. మొత్తం 140 స్థానాల్లో యూడీఎఫ్ 70 నుంచి 80 సీట్ల మధ్య గెలిచే అవకాశం ఉందని అంచనా. మరోవైపు ఎల్డీఎఫ్కు 50కి తక్కువగా, 60 లోపు సీట్లు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. మరికొన్ని సర్వేలు కూడా యూడీఎఫ్కే స్పష్టమైన ఆధిక్యం ఉంటుందని వెల్లడించాయి.