5-State Election Results: అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 9 నుంచి 29 వరకు విడతల వారీగా పోలింగ్ పూర్తయ్యింది. మొత్తం 823 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ ఐదు ప్రాంతాల్లో ఎవరు అధికారంలోకి వస్తారన్నది త్వరలోనే తేలనుంది.
ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది?
తమిళనాడులో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటామనే నమ్మకంతో ఉన్నారు. అదే విధంగా అస్సాంలో సీఎం హిమంత్ బిశ్వ శర్మ కూడా మరోసారి గెలుపు తమదేనని భావిస్తున్నారు. కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని చెబుతోంది. ఇక పశ్చిమ బెంగాల్లో మాత్రం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. రెండు పార్టీలు కూడా తమకే విజయం ఖాయమని ధీమాగా ఉన్నాయి.
బెంగాల్ పరిస్థితి ఏంటి?
ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి.. పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని అనేక సర్వేలు సూచిస్తున్నాయి. అయితే మమతా బెనర్జీ ఈ అంచనాలను పూర్తిగా ఖండించారు. తమ పార్టీ 200కు పైగా స్థానాలు గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందని ఆమె విశ్వాసంగా చెప్పారు.
కేరళలో..
కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయి. మొత్తం 140 స్థానాల్లో యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. కొన్ని సర్వేలు 90కి పైగా సీట్లు కూడా వస్తాయని చెబుతున్నాయి. అయితే, అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూడా పోటీలో బలంగా ఉంది.
అస్సాంలో విజయం ఎవరిది?
అస్సాంలో మాత్రం బీజేపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 80కి పైగా స్థానాలు గెలుచుకునే అవకాశముందని అంచనాలు సూచిస్తున్నాయి.
తమిళనాడులో స్టాలిన్ సత్తా చాటేనా?
తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా గణనీయమైన ప్రభావం చూపే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అన్నాడీఎంకే కూటమి మాత్రం ఈసారి వెనుకబడే అవకాశం ఉందని చెబుతున్నారు.
పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలిచేనా?
పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. మొత్తం 30 స్థానాల్లో సగానికి పైగా సీట్లు గెలుచుకుంటుందని అంచనా.