తెలంగాణరాజకీయం

కాలం తెచ్చిన కరువు కాదు... పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే.

  • నీళ్ల మంత్రి జిల్లాలోనే ఉన్నా చుక్క నీరు తేలేకపోవడం సిగ్గుచేటు.

  • కేసీఆర్ పై ద్వేషంతో మేడిగడ్డ సాకు చెప్పి గోదావరి నీళ్లను ఆంధ్ర కు వదిలేస్తున్నారు.

  • ప్రతీ గడప గడప నుంచి వరంగల్ సభ కు కార్యకర్తలు తరలి రావాలి.

  • బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో : కాంగ్రేస్ కంచర గాడిదలను కళ్ళారా చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఆయన సూర్యాపేటలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం లో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కర్కశంగా పాలిస్తున్న కాంగ్రెస్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారం పోయినా ప్రజల్లో మాత్రం టన్ను ల కొద్దీ అభిమానం చెక్కు చెదరకుండా అలాగే ఉందన్నారు. ప్రతీ తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యంగా గులాబీ జెండానే ఉందని, ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్ పోరాట నామ సంవత్సరమే అంటూ కేటీఆర్ అభివర్ణించారు. తదనుగుణంగానే ఏప్రి ల్ 27న తొలి అడుగు పడబోతుందని గుర్తు చేశారు.

దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మదరాసీలు అని పిలిచేవారని, సదరు పిలుపులను మార్చిన నాయకుడు దివంగత ముఖ్య మంత్రి ఎన్టీఆర్ అని ఆయన గుర్తుచేశారు. ఒక పార్టీ పెట్టి భారత దేశంలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు అన్నారు. ఈ దేశంలో తెలంగాణకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉందని, తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉందని ఎలుగెత్తి చాటిన నాయకుడు కేసీఆర్ అని, భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటని చెప్పారు.

కేసీఆర్ మోకాలు ఎత్తుకు కూడా సరిపోని వాళ్ళు ఆయన గురించి అవాకులు చెవాకులు మాట్లా డుతున్నారని, వాన పాములు నాగు పాముల లెక్క బుసలు కొడుతు న్నాయని ఆయన ఎద్దేవా చేశారు. తమ స్థాయి మరచి గ్రామ సింహాలు కూడా కేసీఆర్ మీద మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక వైపు, దేశాన్ని నడుపుతున్న భారతీయ జనతా పార్టీ ఒక వైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీలో చక్రం తిప్పు తున్న చంద్రబాబు నాయుడు ఇంకోవైపు ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ పార్టీ పెట్టి నడపడం ఆషామాషీ విషయం కాదని గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టిన తెలంగాణ ప్రజా సమితిని చూసిన ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందన్న నమ్మకం చచ్చిపోయిందన్నారు. కానీ 2001లో ఒక్కడిగా బయలు దేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని, ఇదే చరిత్ర అంటూ వివరించారు. కేసీఆర్ లేకపోయినా, గులాబీ జెండా లేకపోయినా తెలంగాణ వచ్చేదే కాదని, ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల పోరాటాలకు కేసీఆర్ నాయకత్వం తోడై విజయం సాధించామని తెలిపారు. 25 ఏళ్ల పార్టీ చరిత్రలో మొదటి 14 ఏళ్ల ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపించామన్నారు.

ప్రజాస్వామ్య బద్దంగా తమ డిమాండ్లను నెరవేర్చుకోవచ్చని దేశ ప్రజలకు నిరూపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. అధికారంలోకి వస్తే పేదల కోసం ఎలా పనిచేయొచ్చో పదేండ్ల పాటు చూపిస్తూ దేశంలో నే తెలంగాణను నెంబర్ వన్ చేసిన నాయకత్వం కేసీఆర్ ది అని కొనియాడారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర లో ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అని, ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అని పునరుద్ఘాటించారు. మాకు ఉద్యమం కొత్త కాదు అధికారం కొత్త కాదు ప్రతిపక్ష పాత్ర కొత్త కాదని గుర్తు చేశారు. తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడం మాకోసం కాదు ప్రజల కోసమని, చరిత్రలో ఒక అనివార్య మైన సందర్భంలో బీఆర్ఎస్ పుట్టిందన్నారు. తెలంగాణ బాగు కోసం మాత్రమే మళ్ళీ అధికారం కోరుకుంటున్నామన్నారు. కర్కశంగా పాలిస్తున్న కాంగ్రెస్ పీడ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేందుకే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు.

ఫీనిక్స్ పక్షిలాగా కదం తొక్కు తోన్న బీఆర్ఎస్ క్యాడర్…

ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడకుండా పోరా డుతున్న గులాబీ సైన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డిది ఒక వికృతమైన మనస్తత్వం అని, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి పర్సనాలిటీ పెంచుకోవడం మీద కంటే పర్సంటేజీలు పెంచుకోవడం మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని ధ్వజమెత్తారు. ఢిల్లీకి మూటలు పంపి పదవిని కాపాడుకునే ధ్యాస తప్ప రేవంత్ కు మరో పని లేదని ఆరోపించారు. యూట్యూబ్ ను అడ్డం పెట్టుకొని ముఖ్యమం త్రి అయిన సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ అదే యూట్యూబ్ జర్నలి స్టులను బట్టలూడదీసి కొడతా అనడం సిగ్గుచేటన్నారు.

నూటికి నూరుశాతం రుణమాఫీ చేశామని నిరూపిస్తే మా పదవులను వదిలిపెడతామని చెప్తే ఇప్పటిదాకా ఆ సవాల్ ని కాంగ్రెస్ నాయకులు ఎవరూ స్వీకరించలేదని ఎద్దేవా చేశారు. రైతులకు రావాల్సిన 37 వేల కోట్ల రూపాయలు ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే ఖాతాల్లో టింగు టింగు మని పడుతున్నాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు. కేసీఆర్ కాంగ్రెస్ సన్నాసులను నమ్మితే రైతు బంధు కి రామ్ రామ్ అయితదని ముందే చెప్పిండని గుర్తు చేశారు.

నీళ్ల మంత్రి , నల్లగొండ లోనే ఉన్నా చుక్కనీరు తేలేక పోతున్నారని విమర్శించారు. అధికారం మత్రమే పోయింది కానీ ప్రజల్లో అభిమానం మాత్రం అలాగే ఉందని అన్నారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు రావడం లేదని అడిగితే ఏ ఒక్క కాంగ్రెస్ నేతకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదన్నారు. కేసీఆర్ కట్టిన కాలేశ్వరం నుంచి నీళ్ళు రాకపోతే మరిప్పుడు కాంగ్రె స్ కట్టిన ఎస్సారెస్పీ నుంచి నీళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నిం చారు. కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రె ను రిపేరు చేయించకుండా గోదావరి నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే దానికి కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణమన్నారు.

రేవంత్ రెడ్డి పాపం రైతన్నకు శాపం…

కృష్ణానదిలో 36 శాతం నీళ్లను కేసీఆర్ ప్రభుత్వం వాడు కుంది. కానీ ఈ కాంగ్రెస్ సన్నాసుల ప్రభుత్వం 24 శాతం నీళ్లను కూడా వాడుకోలేదన్నారు. నీళ్లు వాడుకునే తెలివితో పాటు నీటిని పొదుపు చేసుకునే తెలివి కూడా లేదన్నారు. చెరువులను నింపే తెలివితో పాటు, భూగర్భ జలాలను పెంచే తెలివి కూడా లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించదని, బడే భాయ్ మోడీ, చోటే బాయ్ రేవంత్ మధ్య తెరచాటు ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణకు గొంతుకగా బీఆర్ఎస్ ఉండొద్దనేదే కాంగ్రెస్, బీజేపీ ల ఉమ్మడి లక్ష్యమని అన్నారు. రేవంత్ రెడ్డి అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినా ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసు కోవడం లేదన్నారు.

ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని వరంగల్ సభకు సూర్యా పేట, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సినసమయం ఆసన్నమైందని, ఏప్రిల్ 27 న మరొక్కసారి గులాబీ సైన్యం కదం తొక్కాలని కోరారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పిన ఏతుల వెంకటయ్య కథ విని కాంగ్రెస్ ప్రభుత్వానికి బర్దాష్ కాలేదని, అందుకే ఆయనను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. స్పీకర్ పదవికి కుల, మత పట్టింపులు ఉండవని, స్పీకర్ పదవి అంటే బీఆర్ఎస్ కు ఎంతో గౌరవం ఉందని, గడ్డం ప్రసాద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో బీఆర్ఎస్ పాత్ర కూడా ఉందని గుర్తుకు చేశారు. శాసన సభ మన అందరిదీ అన్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసి గాంధీభవన్ లెక్క సభను నడుపుతున్నారని అన్న అక్బరుద్దీన్ ఓవైసీ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పంచ పాండవుల మాదిరి ఆ కౌరవసభ లో 100 మందిని ఎదుర్కొంటున్న ది కేసీఆర్ గులాబీ దండు మాత్రమేనని తెలిపారు. గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ కు రావాలని పిలుపునిచ్చారు. వరంగల్ సభ తర్వాత మే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కొత్త కమిటీలను పటిష్టంగా నిర్మించుకుందామని, గ్రామ స్థాయి, వార్డు స్థాయి, బూత్ స్థాయి, రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా కమిటీ లను ఏర్పాటు చేసుకుందామని హమీ ఇచ్చారు. కష్టకాలంలో పార్టీ నే నమ్ముకొని ఉన్న వారికే పెద్దపీట వేస్తామని, వారికే అవకాశాలు ఇస్తా మని, చిన్న పెద్ద అనే తేడా పార్టీలో లేదన్నారు. పార్టీ ఆఫీసులను చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తలకు అద్భుతంగా శిక్షణ ఇస్తామన్నారు. చివరి సంవత్సరంలో ఏదో ఒక పథకం ఇచ్చినట్టు చేస్తే ప్రజలు తమనే మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకం తో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా గులాబీ కార్యకర్తలే సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కేసీఆర్ లాగా ప్రతీ కార్యకర్త కథానాయకుడు లాగా విజృంభించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 27 నాడు దానికి తొలి అడుగు పడాలని అన్నారు.

ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టేందుకు తెలంగాణ సంపద…

తెలంగాణ సంపదను సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టార‌ని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన 15 మాసాల కాలం లో రేవంత్ రెడ్డి 40 సార్లు ఢిల్లీకి వెళ్ళాడని, వెళ్లినప్పుడల్లా డబ్బులను అక్కడి పెద్దలకు కడుతూ వస్తున్నార‌ని ఆరోపించారు. ఇప్ప‌టికే రూ.30 వేల కోట్లు కప్పం క‌ట్టార‌ని అంటూనే ఆ క‌ప్పం కట్టకపోతే హైదరాబాదుకు వచ్చేసరికి ఆయన పదవి ఊడుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పార్టీ స్థాపించినప్పుడు ఆయనకు కండబలం, అంగ బలం, ఆర్థిక బలం, కుల బలం లాంటివి ఏమీ లేవని, ప్రజల్లో ఉన్న తెలంగాణ కాంక్షనే గొప్ప ఉద్యమానికి ఊపిరి పోసిందని అన్నారు. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో 11 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలలో బీ ఆర్ఎస్ ఓడిపోతే నల్లగొండ జిల్లాలో పార్టీ పని అయిపోయిందని కొంతమంది నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని వారికి ఈ సమావేశానికి వచ్చిన కార్యకర్తల బలమే బుద్ధి చెబుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మూడు పాత్రల్లో అద్భుతమైన విజయం సాధించిందన్నారు. 14 సంవత్సరా లు ఉద్యమ పార్టీగా, పది సంవత్సరాలు అధికారంలో ఉంటూ తెలంగాణ అభివృద్ధిలో, 15 మాసాల నుండి ప్రతిపక్ష పార్టీగా అనునిత్యం ప్రజల పక్షాన నిలవడం ఆనందంగా ఉందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బంగారం లాంటి పంటలను పండించామని చెప్పారు. అసమర్థ పాలనతో సూర్యాపేట జిల్లాలో గోదావరి జ‌లాలు అందక వేలాది ఎకరాల భూమి నిలువునా ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వారికి ధీటుగా జ‌వాబు చెబుతున్నారంటూ కితాబు నిచ్చారు. బొల్లం మల్లయ్య యాదవ్ కొత్త కారు కొంటే ప్రజల సొమ్ముతో జల్సా చేస్తున్నాడని, మరో ఎమ్మెల్యే కొత్త షర్టు వేసుకున్నా ప్రజల సొమ్మేనని ప్రచారం చేశారని ఆయన అన్నారు. కేసీఆర్ పెద్ద దొర అని, ఆయనది దొరల పాలన అని, తెలంగాణ వస్తే ఆయన కుటుంబం కోసమే తెలంగాణను తెచ్చుకున్నార‌ని ఇలా ప్రతి ఒక్కరి మదిలో కేసీఆర్ పై ద్వేషం పెంచార‌ని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకను కాంగ్రెస్ ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ ఏమాత్రం బలహీన పడలేదని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ పథకాల అమలు కోసం నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. వరంగల్ లో జరిగే పార్టీ 25 సంవత్సరాల వేడుక కార్యక్రమానికి జిల్లా నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడు గుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రామావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button