క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్ చెరువుల పునరుద్ధరణలో ఇళ్లు కోల్పోయిన పేదలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. చెరువులు, నాళాల ఆక్రమణల తొలగింపు సమయంలో ఇళ్లు కోల్పోయిన అసలైన నిరుపేదలకు ప్రభుత్వం తరపున డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
కేవలం ధనిక వర్గాలు, వ్యాపార ప్రయోజనాల కోసం నిర్మించిన అక్రమ కట్టడాలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని, పేదల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు. మూసీ నది ప్రక్షాళన మరియు ఇతర చెరువుల పునరుద్ధరణలో భాగంగా నిరాశ్రయులైన వారికి తగిన పునరావాస సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.