-
పదవీ విరమణ వెంటనే కొలువు..!?
-
లక్షల్లో వేతనం, ప్రభుత్వ తీరుపై విమర్శలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉందని తరచూ వినిపిస్తుంది మాట. కానీ ఇష్టారాజ్యంగా నియామకాల ప్రక్రియ జరుపుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా గురువారం రిటైర్ అయిన తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం కీలక పోస్టును ఇచ్చింది. లక్షల రూపాయల వేతనంతో ఒక్క సలహాదారు పదవి అందించింది. గురువారమే రిటైర్మెంట్ అయిన ఆయనకు ఆగమేఘాల మీద పోస్టింగ్ ఇవ్వడం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. గురువారం పదవీ విరమణ చేసిన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు పదవిలో నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం పదవి ప్రకటించడంలో తప్పులేదు. కానీ కొంత సమయం తీసుకుని ఇవ్వవచ్చు.
సీఎం రేవంత్ కు ఆసక్తి..
డిజిపిగా రిటైర్ అయిన శివధర్ రెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి అంత ఆసక్తి ఏమిటనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్న. పదవుల పంపకాల విషయంలో ముఖ్యమంత్రికి స్వేచ్ఛ ఉంటుంది. ఈ విషయంలో ఎవరు కాదనలేరు కూడా. కానీ ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతూనే.. ఇప్పుడు లెక్కకు మించి సలహాదారులను నియమించడం పై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తికి వెంటనే లక్షల రూపాయలతో సలహాదారు పదవి ఇవ్వడం ఏమిటనేది ఇప్పుడు నేటిజనుల నుంచి వస్తున్న ప్రశ్న.
భారీగా వేతనం…
మరోవైపు శివధర్ రెడ్డి సలహాదారు పదవికి ఇచ్చే వేతనాలపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయన జీతం అక్షరాల నెలకు రెండు లక్షల 25 వేల రూపాయలు. ఆపై ఇంటి అద్దె కింద మరో 50 వేలు చెల్లిస్తారు. ప్రభుత్వ వాహనం, టిఎ/డిఎలతో పాటు మెడికల్ రీయంబర్స్మెంట్ సౌకర్యాలు కూడా అందిస్తారు. మరోవైపు హోంశాఖ ఆయన కోసం ఒక ప్రత్యేక ఓ ఎస్ డి, ప్రైవేటు సెక్రటరీ, ఇద్దరు డ్రైవర్లు, నలుగురు సబర్డినేట్లను ఏర్పాటు చేసింది. ప్రత్యేక సెంట్రల్ ఏసీ తో కూడిన కార్యాలయాన్ని కూడా ఇస్తుంది. అయితే శివధర్ రెడ్డి విషయంలో ఇంతలా ఆసక్తి చూపడానికి కారణం ఏంటనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న.
గతంలో ప్రధాన కార్యదర్శి విషయంలో..
అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నతాధికారులు రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శాంతకుమారి రిటైర్మెంట్ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఆమె గత ఏడాది రిటైర్ అయ్యారు. కానీ అదే రోజు ఆమెకు కీలక పదవి అప్పగించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకు వైస్ చైర్పర్సన్ గా నియమించారు. అయితే డిజిపిగా పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డి అవసరం తెలంగాణకు ఉందని.. అందుకే ఆయనను సలహాదారు పదవిలో నియమించినట్లు సమర్ధించుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం.