హైదరాబాద్ నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై జీహెచ్ఎంసీ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా వాట్సప్ ద్వారానే పలు సేవలను పొందే అవకాశం కల్పించింది. ప్రజలకు సులభంగా, వేగంగా సేవలు అందించాలనే లక్ష్యంతో మీ సేవ సంస్థ ఈ కొత్త విధానాన్ని ప్రారంభించింది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు అధికారులు ఈ డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం 9 రకాల జీహెచ్ఎంసీ సేవలను వాట్సప్ మీ సేవ చాట్బాట్ ద్వారా పొందవచ్చని అధికారులు వెల్లడించారు. దీంతో నగర ప్రజలు ఇంటి వద్ద నుంచే దరఖాస్తులు చేసుకుని సేవలను పొందే వీలు ఏర్పడింది.
ఈ కొత్త విధానంలో ఆస్తి పన్ను సవరణ, పుట్టిన తేదీ మార్పు, మరణ ధృవీకరణ పత్రంలో వివరాల సవరణ, ఇంట్లో జరిగిన జనన నమోదు, ఇంట్లో జరిగిన మరణ నమోదు, ఇంటి నెంబర్ సవరణ, మ్యూటేషన్, ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ వంటి కీలక జీహెచ్ఎంసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సేవల కోసం ప్రజలు తప్పనిసరిగా మీ సేవ కేంద్రాలను సంప్రదించాల్సి వచ్చేది. కొత్త సదుపాయం వల్ల సమయం, ప్రయాణ ఖర్చులు, కార్యాలయాల వద్ద నిరీక్షణ వంటి సమస్యలకు చెక్ పడనుంది. ముఖ్యంగా ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు ఈ సేవల ద్వారా ఎక్కువగా లాభపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అంతేకాకుండా మీ సేవ అధికారిక వెబ్సైట్లోని చాట్బాట్ ద్వారా కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే ట్రాఫిక్ చలాన్లు చెల్లించడం, ఆదాయ ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, విద్యుత్ బిల్లుల చెల్లింపులు వంటి సేవలను ప్రజలు భారీగా ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో డిజిటల్ సేవల వినియోగం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రజలు ముందుగా 8096958096 నెంబర్ను “మీ సేవ తెలంగాణ” పేరుతో మొబైల్లో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సప్ ఓపెన్ చేసి “హాయ్” అని సందేశం పంపాలి. ఆ తర్వాత కనిపించే మెనూలో అవసరమైన సేవను ఎంచుకుని “ఓపెన్ సర్వీస్” ఎంపికపై క్లిక్ చేయాలి. అనంతరం దరఖాస్తుకు సంబంధించిన వివరాలను నమోదు చేసి, అవసరమైన రుసుమును చెల్లిస్తే ప్రక్రియ పూర్తవుతుంది. ఈ కొత్త సేవలతో హైదరాబాద్ నగర ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా చేరువ కానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
ALSO READ: ఏ పదవిలో ఉన్న ఇమిడిపోయే వ్యక్తి సుజనా చౌదరి…! ప్రజల సమస్యలపై ఫోకస్