తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక శుభవార్త ప్రకటించింది. భక్తులు శ్రీవారికి సమర్పించిన వస్త్రాలను ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. మే 21 నుండి జూన్ 2 వరకు ఈ ప్రత్యేక ఈ-వేలం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ వేలంలో కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి కలిపి మొత్తం 505 రకాల వస్త్ర సామగ్రి అందుబాటులో ఉండనున్నాయి. శ్రీవారికి సమర్పించిన ఈ వస్త్రాలను కొనుగోలు చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతారని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
ఈ ఈ-వేలంలో పాలిస్టర్, నైలాన్, కాటన్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్ పీస్లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్షీట్లు, దిండు కవర్లు, పంజాబీ డ్రస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, పరదాలు, శిరోవస్త్రాలు, గొడుగులు, హుండీ గల్లేబులు, ఈర్వాడాలు వంటి పలు వస్త్ర వస్తువులు అందుబాటులో ఉండనున్నాయని టీటీడీ పేర్కొంది. ఈ వస్తువుల కొనుగోలుకు ఆసక్తి గల భక్తులు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపింది. అలాగే టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది.
ఇదిలా ఉండగా పట్టు వస్త్రాలు, శాలువాల కొనుగోళ్ల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నాసిరకం వస్త్రాలు, నాణ్యతలేని శాలువాల కొనుగోళ్లు జరిగాయని భావించిన టీటీడీ, ఇప్పుడు నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విజిలెన్స్ నివేదికలో బయటపడిన వివరాల ప్రకారం గతంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు గుర్తించిన అధికారులు చర్యలు ప్రారంభించారు. పట్టుకు బదులుగా పాలిస్టర్ వస్త్రాలను అధిక ధరలకు సరఫరా చేస్తున్న వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్ మరియు దాని అనుబంధ సంస్థల టెండర్లను టీటీడీ ఇప్పటికే రద్దు చేసింది. గతేడాది డిసెంబర్లోనే ఆ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వస్త్రాల వ్యవహారంపై విచారణ కొనసాగుతుండగా, మరోవైపు భక్తులకు వస్త్రాల కొరత తలెత్తకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇకపై ప్రైవేట్ కాంట్రాక్టర్లను పూర్తిగా పక్కనపెట్టి, కేవలం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆప్కో సంస్థతో పాటు తమిళనాడుకు చెందిన కో-ఆప్టెక్స్ సంస్థల నుంచే నాణ్యమైన పట్టు వస్త్రాలు, శాలువాలను కొనుగోలు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈ కొనుగోళ్ల కోసం టీటీడీ బోర్డు ఇప్పటికే రూ.44.20 కోట్ల నిధులను ఆమోదించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వస్త్రాలను కొనుగోలు చేయనున్నారు. శ్రీవారిని దర్శించుకుని వేద ఆశీర్వచనం పొందే భక్తులకు ఈ పట్టు వస్త్రాలు, శాలువాలను బహుకరించనున్నారు. తాజా నిర్ణయంతో భక్తులకు అందించే దుప్పట్లు, శాలువాల కొరత తగ్గడమే కాకుండా నాణ్యమైన వస్త్రాలు అందుబాటులోకి రానున్నాయని టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు.
ALSO READ: వాట్సప్తో జీహెచ్ఎంసీ సేవలు.. ఈ నెంబర్తో..