ముంబై గజిబిజి నగరంలో ఒక యువతి తన కలను సాధించేందుకు చేస్తున్న కృషి ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఖుష్బూ అనే అమ్మాయి, ఫుడ్ డెలివరీ పార్ట్నర్గా పనిచేస్తూనే, పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తోంది.
ఘాజీపూర్ జిల్లాకు చెందిన ఖుష్బూ, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా స్వయం సంపాదన కోసం ముంబైకి వచ్చి స్విగ్గీలో డెలివరీ పార్ట్నర్గా చేరింది. అయితే, ఇది ఆమెకు అంతిమ గమ్యం కాదు. చిన్నప్పటి నుంచి పోలీస్ యూనిఫాం ధరించి సేవ చేయాలన్న కోరికను నిజం చేసుకోవడమే ఆమె కల. అదే లక్ష్యంతో పగలు డెలివరీలు చేస్తూ, రాత్రి సమయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది.
ఆమె కథ మరింత మందికి చేరేందుకు కారణమైంది స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ సీఈవో రోహిత్ కపూర్. తన వీడియో సిరీస్లో భాగంగా ఖుష్బూ ప్రయాణాన్ని పంచుకోవడంతో, ఈ కథ ఇంటర్నెట్లో వైరల్ అయింది. సాధారణంగా నగరాలకు వచ్చిన వారు అక్కడే స్థిరపడాలని ఆశపడుతుంటే, ఖుష్బూ మాత్రం తన గ్రామానికి తిరిగి వెళ్లి సేవ చేయాలన్న సంకల్పంతో ఉండటం ప్రత్యేకతగా నిలిచింది.
ఐదుగురు సహోదరులతో కూడిన కుటుంబంలో పెరిగిన ఖుష్బూ, తన చదువు ఖర్చులను తానే భరించాలనే నిశ్చయంతో ఈ మార్గాన్ని ఎంచుకుంది. ఆమె పట్టుదల, క్రమశిక్షణ ఇప్పుడు వేలాది మందికి స్ఫూర్తిగా మారుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కష్టాల మధ్యలో కూడా లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగడం ఎంత ముఖ్యమో ఖుష్బూ కథ మరోసారి నిరూపిస్తోంది.
also read: 400 ఏళ్లుగా చెక్కుచెదరని చెక్క రాజభవనం… దక్షిణాది అద్భుత వైభవం!