హైదరాబాద్లో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. నకిలీ వాటర్ బిల్లు మెసేజ్ను నమ్మిన ఓ రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి భారీగా మోసపోయాడు. ఈ ఘటన నగరంలో కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే… ఈ నెల 1వ తేదీన బాధితుడి మొబైల్కు “వాటర్ బిల్లు చెల్లించకపోతే మీ కనెక్షన్ కట్ చేస్తాం” అనే హెచ్చరికతో ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్లో ఇచ్చిన నంబర్ను సంప్రదించిన ఆయన, కేవైసీ ప్రక్రియ పేరుతో మాట్లాడిన వ్యక్తి సూచనలు పాటించారు.
సైబర్ నేరగాడు చాకచక్యంగా బాధితుడి బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం సమాచారం సేకరించాడు. ఓటీపీ చెప్పకపోయినా, బాధితుడి ఫోన్లో నకిలీ యాప్లు ఇన్స్టాల్ చేయించి మాల్వేర్ ద్వారా ఖాతాను హ్యాక్ చేశాడు. దీంతో ఒక్కసారిగా రూ.4.19 లక్షలు ఖాతా నుంచి మాయమయ్యాయి.
డబ్బు పోయిందని గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి.
ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలియని నంబర్ల నుంచి వచ్చే బిల్లులు, లింకులు నమ్మకండని చెప్తున్నారు. కేవైసీ పేరుతో వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పకూడదని, తెలియని యాప్లు డౌన్లోడ్ చేయవద్దని సూచిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వెంటనే అధికారిక సంస్థను సంప్రదించాలని, సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు తప్పనిసరి అని అధికారులు హెచ్చరిస్తున్నారు.