-ఫ్యామిలీ ప్యాకేజీ ప్రకటించిన జగన్
-భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా కుమార్తె డాక్టర్ అనూష
-విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి యధావిధిగా బొత్స ఝాన్సీ లక్ష్మి
-నెల్లిమర్ల నుంచి కుమారుడు డాక్టర్ సందీప్
-ఛీపురుపల్లి నుంచి బొత్స, గజపతినగరం నుంచి తమ్ముడు అప్పల నరసయ్య
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో :-
సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు సమ్మతించారు. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను పార్టీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో.. విజయనగరం జిల్లాలో నష్ట నివారణకు దిగారు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ బొత్స గుడ్ బై చెప్తే ఉత్తరాంధ్ర పై పెను ప్రభావం చూపడం ఖాయం. ఆ నష్టం ఊహించలేనిది కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉండాలని.. సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తక్షణం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూషను నియమించారు. దీంతో బొత్స పార్టీ నుంచి చేజారకుండా జగన్మోహన్ రెడ్డి కొంత అడ్డుకట్ట వేయగలిగారు.
గతం కంటే ఎక్కువగా..
గతం కంటే ఎక్కువగా బొత్స ఫ్యామిలీకి టికెట్లు ఇచ్చేందుకు జగన్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. గతంలో బొత్స చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు. ఆయన తమ్ముడు అప్పల నరసయ్య గజపతినగరం నుంచి.. మరో సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి బరిలో దిగేవారు. బొత్స ఝాన్సీ లక్ష్మి జిల్లా పరిషత్ చైర్మన్ గాను.. తరువాత మేనల్లుడు చిన్న శ్రీను ఆ పదవికి ఎంపికయ్యారు. విజయనగరం ఎంపీగా కూడా బొత్స ఝాన్సీ లక్ష్మీ వ్యవహరించారు. చిన్న శ్రీను బయటకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో అడ్డగోలుగా చీలిక వచ్చింది. అయినా సరే బొత్స ఫ్యామిలీకి పూర్తిస్థాయిలో టిక్కెట్లు ఇచ్చేందుకు జగన్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
అప్పట్లో చాలా ఇబ్బందులు..
2014 ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయింది. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా పోయింది విజయనగరంలో. ఆ ప్రభావం ఉత్తరాంధ్ర పై కూడా చూపింది. అందుకే 2019 ఎన్నికలకు ముందు బొత్స ఫ్యామిలీని ప్రత్యేకంగా రప్పించుకున్నారు జగన్. ఆ ఫ్యామిలీకి నాలుగు టికెట్లు ఇచ్చారు. బొత్సను అయిదేళ్లపాటు మంత్రిగా కొనసాగించారు. అయితే చిన్న శ్రీను పార్టీ నుంచి వెళ్లిపోగా.. బడ్డుకొండ అప్పలనాయుడు సైతం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారని ప్రచారం నడుస్తోంది. మరోవైపు బొత్స సైతం జంప్ చేయక తప్పదు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఆ రకమైన అనుమానం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ బొత్స సత్యనారాయణ ను పిలిపించుకుని మాట్లాడారు. ఆ కుటుంబానికి ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
వారందరినీ కాదని..
విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లాంటి నేతలు ఉండగా.. భీమిలి నియోజకవర్గ ఇన్చార్జిగా బొత్స కుమార్తె డాక్టర్ అనూషను ప్రకటించారు జగన్. బొత్స యధావిధిగా చీపురుపల్లి నుంచి బరిలో దిగనున్నారు. బొత్స ఝాన్సీ లక్ష్మికి తిరిగి విశాఖ పార్లమెంట్ సీటు ఇవ్వనున్నారు. బొత్స అప్పల నరసయ్య గజపతినగరం నుంచి మరోసారి పోటీకి దిగుతారు. ఇంకోవైపు బొత్స కుమారుడు డాక్టర్ సందీప్ నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇలా ఆ కుటుంబంలో ఐదుగురికి టికెట్లు ఇచ్చేందుకు జగన్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కేవలం బొత్స పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారన్న ప్రచారం నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడినట్లు సమాచారం. అయితే చిన్న శ్రీను రూపంలో బలమైన శక్తి వెళ్ళిపోయిన నేపథ్యంలో.. జగన్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది చూడాలి.
