-నిరుపేదలు, మధ్యతరగతి వారి ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ
-రూ.8,874 కోట్ల విలువగల ఇళ్లకు సంపూర్ణ హక్కులు
-లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందించిన సీఎం చంద్రబాబు
క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం :-
విశాఖ మహానగరంలో నివాసం ఉంటున్న వేలాదిమంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం గొప్ప వరం ప్రకటించింది. దశాబ్దాల నిరీక్షణకు సరైన ఫలితం లభించింది. ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్న నిరుపేదలకు.. ఆ స్థలాలపై సంపూర్ణ యజమాన్య హక్కులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జీవో 296, 388 నిబంధనల ప్రకారం పెండింగ్లో ఉన్న ఆక్రమణలను క్రమబద్ధీకరించారు . శనివారం విశాఖ మహానగరంలో సీఎం వేలాదిమంది లబ్ధిదారులకు పూర్తి హక్కులతో కూడిన ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి చేశారు. నిజంగా ఇది గొప్ప విషయమే. దశాబ్దాలుగా తీవ్ర అభద్రతాభావంతో బతుకుతున్న నిరుపేదలు, మధ్యతరగతి వారికి కూటమి ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు అయింది.
ఏకంగా 11 మండలాల్లో..
కూటమి ప్రభుత్వం ఈ బృహత్తర క్రమబద్ధీకరణ పథకం ద్వారా.. విశాఖ జిల్లాలోని 11 మండలాల పరిధిలో 28,445 కుటుంబాలకు శాశ్వత భూ హక్కు లభించింది. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.8,874 కోట్ల విలువైన 19,33, 853 చదరపు గజాల ప్రభుత్వ భూమిని అధికారులు క్షేత్రస్థాయి సర్వేల అనంతరం అధికారికంగా క్రమబద్ధీకరించారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా కాగితాలకే పరిమితమైన ఈ సమస్యను ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించింది. ముఖ్యంగా 100 చదరపు గజాల లోపు నివాసం ఉంటున్న.. అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఉచితంగానే క్రమబద్ధీకరించి.. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజుల భారం లేకుండా పట్టాలు అందించేందుకు విశాఖ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
దశాబ్దాలుగా ఎదురుచూపులు..
దశాబ్దాలుగా వేలాది మంది మధ్యతరగతి ప్రజలు సొంతింటి హక్కు కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇళ్ళ నిర్మాణం అయితే జరిపారు కానీ పూర్తి అభద్రతాభావంతో ఉంటూ వస్తున్నారు. ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న విశాఖలో సామాన్య, బడుగు బలహీన వర్గాలను విస్మరించకుండా.. నగర అభివృద్ధిలో వారిని సైతం సమాన భాగస్వామ్యులను చేయాలన్నదే తమ లక్ష్యం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒకవైపు నగరానికి అంతర్జాతీయ పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టులు, ఐటీ పరిశ్రమలను రప్పిస్తూనే.. మరోవైపు నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతులను సమకూర్చుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమం కేవలం ఒక సాధారణ పట్టాల పంపిణీ మాత్రమే కాదని.. వేలాది కుటుంబాల జీవన భద్రతను శాశ్వతంగా స్థిరపరిచే ఆర్థిక సాధికారిత అని సీఎం స్పష్టం చేశారు.
