క్రైమ్ మిర్రర్, సినిమా:- ఈ సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ‘ఇరుముడి’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. థియేటర్లలో అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోయి, ఈ ఏడాదిలోనే తెలుగులో ఎక్కువ మంది చూసిన సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఇంతటి ఘన విజయం సాధించినప్పటికీ, ఈ చిత్రం ఓ అరుదైన మైలురాయిని మాత్రం తృటిలో చేజార్చుకుంది.
సినిమాకు థియేటర్లలో ఇంకా మంచి ఆదరణ ఉన్న సమయంలోనే డిజిటల్ ప్లాట్ఫామ్ (ఓటీటీ)లోకి అడుగుపెట్టడం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును చేరుకునే దిశగా అప్రతిహతంగా సాగిన ‘ఇరుముడి’.. ఓటీటీ రిలీజ్ ఎఫెక్ట్తో ఆ మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయింది. చివరికి నైజాంలో కలెక్షన్లు రూ.95 కోట్ల వద్దే ఆగిపోయాయి. ఒకవేళ ఓటీటీలోకి ఈ సినిమా రాక మరికొద్ది రోజులు ఆలస్యంగా జరిగి ఉంటే, నైజాంలో సునాయాసంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేదని సినీ విశ్లేషకులు, ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
నైజాం ప్రాంతంలో రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం అనేది పాన్ ఇండియా స్థాయి సినిమాలకు మాత్రమే సాధ్యమైన చాలా అరుదైన రికార్డు. ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలో కేవలం ఐదు సినిమాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి. ప్రతిష్టాత్మక చిత్రాలైన బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ (RRR), పుష్ప-2, సలార్, అలాగే కల్కి 2898 AD చిత్రాలు మాత్రమే నైజాంలో వంద కోట్ల క్లబ్లో స్థానం దక్కించుకున్నాయి. ఓటీటీకి కాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే ‘ఇరుముడి’ సైతం ఈ ఎలైట్ క్లబ్లో సగర్వంగా చేరి ఉండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
స్పామ్ కాల్స్, మెసేజ్లకు ఇక చెక్.. టెలికాం సంస్థలకు ‘ట్రాయ్’ కఠిన నిబంధనలు!
