•అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్
•చరిత్రతో పాటు వారసత్వ సంపద అన్వేషణ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో చరిత్ర అన్వేషణకు అటవీ శాఖ పరంగా అనుమతులు ఇచ్చారు. ఆర్కియా లజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏఎస్ఐ సర్వే ప్రారంభం కానుంది. నిజంగా ఇది శుభ పరిణామం. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉంది ఈ సుదీర్ఘ అటవీ ప్రాంతం. దట్టమైన నల్లమల అడవుల్లో చారిత్రక ప్రదేశాలు, వారసత్వ సంపద ఉందని ఏపీ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు దాన్ని వెలికి తీసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆ సర్వేకు అటవీ శాఖ పరంగా అనుమతి ఇచ్చారు సంబంధిత మంత్రి పవన్ కళ్యాణ్. దీంతో ఈ సర్వే ప్రారంభానికి మార్గం సుగమం అయింది.
ముఖ్య ఉద్దేశ్యంతోనే..
అడవులు జీవవైవిద్యంతో పాటు చారిత్రిక పురావస్తు, సాంస్కృతిక సంపదకు నిలయాలు. అటువంటి అడవుల్లో వారసత్వ సంపదను గుర్తించి సంరక్షించడంతోపాటు మన చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అటవీ ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలు, పురావస్తు అవశేషాలు, ఎకో టూరిజం అభివృద్ధికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. అందులో భాగంగానే నల్లమల అటవీ ప్రాంతంలో దాగివున్న అమూల్యమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను గుర్తించి, సంరక్షించేందుకు, శాసనాల సర్వే నిర్వహించేందుకు భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు ఏపీ అటవీ శాఖ అనుమతులు జారీ చేసింది.
గతంలో ఎన్నో అంశాలు..
గతంలో ఈ సర్వేలో ఏపీలో చాలా రకాల ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. కడప జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన సర్వేలో క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు సుమారు 30 శాసనాలు వెలుగు చూశాయి. పదివేల సంవత్సరాల నాటి గుహ చిత్రాలను కూడా గుర్తించారు. ఈ శాసనాలు శాతవాహనుల కాలం, బౌద్ధ, శైవ సంప్రదాయాలతో పాటు ప్రాచీన యాత్ర మార్గాలను, మానవ జీవన విధానాలకు సంబంధించిన విలువైన సమాచారం అప్పట్లో వెలుగులోకి వచ్చింది. అయితే తాజా సర్వేలో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణ లక్ష్యాలకు భంగం కలగకుండా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఈ సర్వే సహకరించనున్నారు. మరి ఎటువంటి వారసత్వ సంపద గురించి తెలుస్తుందో చూడాలి.