Ashwagandha Safety Update: అశ్వగంధను ఆరోగ్య మరియు ఆహార ఉత్పత్తుల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ మొక్కలోని వేళ్లు మాత్రమే వినియోగానికి సురక్షితమని, ఆకులు, వాటి సారాన్ని ఉపయోగించడం ఆరోగ్యానికి ప్రమాదకరమని భారత ఆహార భద్రత నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. ఆకుల వినియోగం వల్ల కాలేయానికి నష్టం కలగడం, జీర్ణ సమస్యలు రావడం, నరాల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అశ్వగంధ ఆకుల వాడకంపై నిషేధం
ఈ కారణాలతో, అశ్వగంధ ఆకుల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనలను పాటించని ఆహార తయారీ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. అలాగే, అశ్వగంధను ఉపయోగించే కంపెనీలు తప్పనిసరిగా తాము మొక్కలోని ఏ భాగాన్ని ఉపయోగిస్తున్నారో స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆందోళన
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేయడంతో, నియంత్రణ చర్యలు మరింత కఠినంగా అమలు చేయబడుతున్నాయి. ప్రస్తుతం అశ్వగంధ మార్కెట్ విలువ వేల కోట్ల రూపాయల స్థాయిలో ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఈ పంట సాగు చేస్తున్నారు. విదేశాల్లో కూడా అశ్వగంధకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో దీనిని టీ మిశ్రమాలుగా, శక్తివర్ధక పానీయాలుగా వినియోగిస్తున్నారు. భారతదేశంలో ముఖ్యంగా పురుషులు దీనిని ఎక్కువగా వాడుతున్నారు. శరీర బలం పెరగడం, శక్తి పెరగడం, అలాగే లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం దీనిని ఉపయోగించడం సాధారణం.