డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారం భద్రత అత్యంత కీలకం. బ్యాంకింగ్, ఉద్యోగం, రుణాలు, ఇతర సేవల కోసం కేవైసీ పత్రాలు అవసరమవుతున్నాయి. అయితే ఆధార్, పాన్ కార్డు వంటి కీలక పత్రాలను వాట్సాప్లో తెలియని వ్యక్తులకు లేదా అనధికారిక నంబర్లకు పంపడం ప్రమాదకరంగా మారొచ్చు.
మీరు పంపిన పత్రాలు తప్పు వ్యక్తుల చేతుల్లోకి వెళితే వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. నకిలీ సిమ్ కార్డులు, మోసపూరిత బ్యాంక్ ఖాతాలు, ఆన్లైన్ రుణాలు తదితర సైబర్ మోసాల్లో వ్యక్తిగత గుర్తింపు వివరాలను ఉపయోగించే ప్రమాదం ఉంది.
కేవైసీ పత్రాలు పంపేటప్పుడు జాగ్రత్త
అవసరం లేకుండా ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, పాస్పోర్ట్ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ పంపకపోవడం మంచిది. ఒకవేళ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి వస్తే సంబంధిత సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే పంపడం సురక్షితం.
అవసరాన్ని బట్టి డిజిలాకర్, మాస్క్డ్ ఆధార్, వాటర్మార్క్ చేసిన పత్రాలు, పాస్వర్డ్ రక్షిత PDFలు వంటి భద్రతా మార్గాలను ఉపయోగించవచ్చు.
వాట్సాప్లో పత్రాలు పంపాల్సి వస్తే..
పూర్తి పత్రాన్ని పంపే ముందు అది నిజంగా అవసరమా? పత్రాన్ని అడుగుతున్న వ్యక్తి లేదా సంస్థ అధికారికమైనదేనా? అనే విషయాలను నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా తెలియని నంబర్ల నుంచి వచ్చే కేవైసీ అభ్యర్థనలు, లింకులు, అత్యవసరంగా పత్రాలు పంపాలంటూ చేసే ఒత్తిళ్లను నమ్మకపోవడం మంచిది.
మీ వ్యక్తిగత డేటా ఒకసారి ఇతరుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత దాని దుర్వినియోగాన్ని అడ్డుకోవడం కష్టం. అందుకే కేవైసీ పత్రాలను షేర్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత.
also read: కొత్తపేటలో పోలీసు ఇంట్లో చోరీ.. 28 కాసుల బంగారం, వెండి, నగదు అపహరణ
