Crime Mirror, AP Politics: ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన సరదా సమాధానాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. యువతను ఆకట్టుకునేలా నిర్వహించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజకీయాల నుంచి సినిమాలు, కుటుంబం, వ్యక్తిగత అభిరుచుల వరకు పలు ఆసక్తికర ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్వ్యూలో భాగంగా ఒకే రోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే ముందుగా ఏ సినిమా చూస్తారు? అని ప్రశ్నించగా.. లోకేష్ చిరునవ్వుతో స్పందిస్తూ రెండు సినిమాలు ఒకే రోజు చూస్తా అని చెప్పారు. ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వకుండా ఇద్దరు హీరోలపై సమాన అభిమానాన్ని వ్యక్తం చేసిన ఆయన సమాధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ క్లిప్ వైరల్ అవుతుండగా, నెటిజన్లు కూడా లోకేష్ డిప్లొమాటిక్ ఆన్సర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని కావాలా? లేక రాష్ట్రపతి కావాలా? అనే ప్రశ్నకు కూడా లోకేష్ ఆసక్తికరంగా స్పందించారు. ఆ రెండు పదవుల కంటే చంద్రబాబు నాయుడు అమరావతిలోనే ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేయాలని తాను కోరుకుంటానని చెప్పారు. నవ్యాంధ్ర నిర్మాణమే ఆయన ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర అభివృద్ధే తన కుటుంబానికి ముఖ్యమని పేర్కొన్నారు.
వ్యక్తిగత అభిరుచుల గురించి అడిగిన ప్రశ్నలకు కూడా లోకేష్ సరదాగా సమాధానాలు ఇచ్చారు. హైదరాబాద్ బిర్యానీ కంటే రాయలసీమ ప్రత్యేక వంటకం అయిన రాగి సంగటినే ఎక్కువగా ఇష్టపడతానని తెలిపారు. సంప్రదాయ ఆహారమే ఆరోగ్యానికి మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయాలపై కూడా తన విశ్వాసాన్ని వ్యక్తం చేసిన లోకేష్, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమవుతాయని అన్నారు.
సినిమాలు, రాజకీయాలు, వ్యక్తిగత అభిరుచులపై నారా లోకేష్ ఇచ్చిన ఈ సమాధానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి.