రైలు ప్రయాణం అంటే చాలామందికి సౌకర్యంగా, ఆనందంగా గమ్యానికి చేరుకునే మార్గం. కానీ కొన్నిసార్లు ఇతర ప్రయాణికుల ప్రవర్తనే ఆ అనుభవాన్ని చెడగొడుతుంది. తాజాగా ఒక వ్యక్తి తనకు ఎదురైన అసహజ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్గా మారింది.
ఆ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం… తన పక్క సీటులో కూర్చున్న ఒక ప్రయాణికుడు దాదాపు 8 గంటల పాటు నిర్లక్ష్యంగా ప్రవర్తించాడట. తాను తిన్న ప్రతి ఆహార పదార్థం తర్వాత ఖాళీ కవర్లు, ర్యాపర్లు అన్నీ సీటు పక్కనే వేస్తూ పరిసరాలను చెత్తతో నింపేశాడని పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా, డస్ట్బిన్ దగ్గరలోనే ఉన్నప్పటికీ అతను దాన్ని ఉపయోగించలేదని తెలిపారు.
పైగా, అందరూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా ఆ ప్రయాణికుడు మొబైల్లో గేమ్స్ ఆడుతూ పెద్ద శబ్దం చేస్తూ ఇతరులకు అసౌకర్యం కలిగించాడట. ఈ పరిస్థితిని చూసి అతనికి చెప్పాలనిపించినా… చివరకు ఆ వ్యక్తి వెనక్కి తగ్గాడు. అపరిచితులతో వాదించడం వల్ల పరిస్థితి మరింత విషమించవచ్చని భావించి మౌనంగా ఉండటం మంచిదని నిర్ణయించుకున్నాడు. “ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి… ఎందుకంటే కొన్నిసార్లు చిన్న విషయమే పెద్ద గొడవగా మారే అవకాశం ఉంటుంది” అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ ఘటనపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందనలు వచ్చాయి. చాలా మంది యూజర్లు ఇలాంటి సందర్భాల్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. సరైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
also read: ప్రాణం తీసిన ఫొటో సరదా – గోవా బీచ్లో రాకాసి అలలకు యువకుడు బలి, వైరల్ వీడియో