హైదరాబాద్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రముఖ బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్నారు. బాలాపూర్ గణేశ్ మండపానికి చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పట్లోళ్ల కౌశిక్ రెడ్డితో కలిసి విజయ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
విజయ్ దేవరకొండ బాలాపూర్ మండపానికి చేరుకోవడంతో అక్కడ సందడి నెలకొంది. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి, ఇతర సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. అనంతరం ప్రసిద్ధ బాలాపూర్ లడ్డూను ప్రసాదంగా అందించారు.
విజయ్ దేవరకొండ రాక విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో మండపం వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన హీరోను చూసేందుకు యువత ఆసక్తి చూపింది. ‘విజయ్ అన్న’ అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. ఫొటోలు, సెల్ఫీల కోసం అభిమానులు పోటీపడటంతో మండపం పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
అభిమానుల ఉత్సాహాన్ని చూసిన విజయ్ దేవరకొండ వారికి అభివాదం చేస్తూ స్పందించారు. దీంతో బాలాపూర్ గణేశ్ మండపం వద్ద కొద్దిసేపు సందడి వాతావరణం కనిపించింది.
also read: సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. కారులో మంటలు, ప్రముఖ న్యూరో సర్జన్ సజీవదహనం
