క్రైమ్ మిర్రర్ : పెళ్లయిన నాలుగు నెలలకే ఓ వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్తే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన మేడిపల్లి విద్యాసాగర్ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి చిన్నబోయిన రేణుకతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న విద్యాసాగర్.. ఇదే విషయమై ఆమెతో తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో భార్యతో మరోసారి వివాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన విద్యాసాగర్.. రేణుక గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని కారులోనే వదిలిపెట్టి అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
also read : పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి
