ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో హంగామా సృష్టించిన ఘటన కలకలం రేపింది. కారు డ్రైవర్తో మొదలైన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో భక్తులు, మహిళలు, సెక్యూరిటీ గార్డుపై యువకులు దాడికి పాల్పడినట్లు సమాచారం.
అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న యువకులు కారు డ్రైవర్తో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో అక్కడున్న భక్తులు, మహిళలు, సెక్యూరిటీ సిబ్బందితోనూ వారు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో కొందరిపై దాడి చేయడంతో ఆలయ పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
గొడవ అనంతరం యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు, భక్తులు వారిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి ముగ్గురు యువకులను అప్పగించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు.
ఈ ఘటనతో వివాహ కార్యక్రమానికి వచ్చిన మహిళలు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో అర్ధరాత్రి మద్యం మత్తులో యువకులు హల్చల్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.
also read: ఇన్స్టాగ్రామ్ వీడియోతో చిక్కిన వేటగాళ్లు.. ఉడుమును వండి తింటూ పోస్టు చేసిన ముగ్గురు అరెస్ట్
