క్రైమ్ మిర్రర్ : మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువ యూట్యూబర్తో పాటు ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా మహాఖాస్ గ్రామానికి చెందిన ఛావి వర్షిణీ (23), ఆమె తల్లి సారిక (50)గా గుర్తించారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం ఉజ్జైన్-గారోత్ నాలుగు లేన్ల రహదారిపై రామఖేడి గ్రామం సమీపంలో జరిగింది. ఛావి వర్షిణీ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఉజ్జైన్కు వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన ట్రక్కుతో కారు ఢీకొన్నట్లు సమాచారం.
కారులో ఛావితో పాటు ఆమె తల్లి సారిక, తండ్రి శ్యామ్లాల్, బంధువు సూరజ్పాల్, డ్రైవర్ సచిన్ ఉన్నారు. ప్రమాదంలో ఛావి, సారిక అక్కడికక్కడే మృతి చెందగా.. శ్యామ్లాల్, సూరజ్పాల్, సచిన్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్హెచ్ఏఐ అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను తొలుత సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఏడు లక్షలకు పైగా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు
ఛావి వర్షిణీ యూట్యూబ్లో మంచి గుర్తింపు పొందారు. 2021లో ఆమె ప్రారంభించిన ఛానెల్కు ప్రస్తుతం ఏడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం. డైలీ వ్లాగ్స్తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలను ఆమె తన ఛానెల్లో పోస్టు చేసేవారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న బరోడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
also read ; భర్తతో వెళ్లేందుకు నిరాకరించిందని భార్యపై దాడి.. బండరాయితో కొట్టి హత్య
