ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో పెళ్లైన కొద్ది రోజులకే ఓ నవ వధువు ఇంటి నుంచి అదృశ్యమవడం కలకలం రేపింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవాస్ వికాస్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మధ్యవర్తుల సమక్షంలో జూన్ 27న విష్ణు అనే యువకుడికి ప్రీతితో వివాహం జరిగింది. పెళ్లి ఖర్చుల కోసం వధువు కుటుంబం నుంచి సుమారు రూ.1.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివాహం జరిగిన కొద్ది రోజులకే, జూలై 3న తెల్లవారుజామున ప్రీతి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతకగా.. ఇంట్లో ఉంచిన రూ.4 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.16 వేల నగదు కూడా కనిపించలేదు.
దీంతో ఆమె ఆభరణాలు, నగదుతో వెళ్లిపోయి ఉంటుందని అనుమానించిన అత్తింటి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే తొలుత పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.
కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నవ వధువు ఆచూకీ, అదృశ్యమైన నగలు, నగదుకు సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: తండ్రి చేతిలో కుమారుడి దారుణ హత్య.. తీజ్ వేడుకల్లో విషాదం
