క్రైమ్ మిర్ర పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం హత్యకు పాల్పడిన ఘటన ధర్మసాగర్ పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. చిల్పూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అలియాస్ వెంకన్న (45)ను మాట్లాడదామని ఇంటి నుంచి తీసుకెళ్లి, రాంపూర్ గ్రామంలోని మడేలయ్య గుడి సమీపంలో గొంతు కోసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
రాత్రి ఇంటి నుంచి తీసుకెళ్లిన సంపత్
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి వెంకన్న తన భార్య, కుమార్తెతో కలిసి ఇంట్లో భోజనం చేస్తుండగా దామెర సంపత్ అక్కడికి వచ్చాడు. పరమేష్తో ఉన్న పాత వివాదం గురించి మాట్లాడాలని, తన వెంట రావాలని వెంకన్నను కోరినట్లు తెలుస్తోంది. దీంతో సంపత్తో కలిసి వెంకన్న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి చాలా సమయం గడిచినా వెంకన్న ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సంపత్ను ఫోన్లో సంప్రదించారు. గ్రామపంచాయతీ వద్ద వెంకన్నను దింపినట్లు అతడు చెప్పినప్పటికీ అక్కడ వెంకన్న కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఆ తర్వాత సంపత్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో ఆందోళన మరింత పెరిగింది.
తెల్లవారుజామున షాకింగ్ సమాచారం
మంగళవారం ఉదయం రాంపూర్కు చెందిన ఓ వ్యక్తి ద్వారా వెంకన్న హత్యకు గురైన విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. వెంటనే వారు రాంపూర్లోని మడేలయ్య గుడి సమీపానికి చేరుకున్నారు. అక్కడ వెంకన్న రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి తీవ్ర విషాదానికి గురయ్యారు.
గతంలోనూ వివాదాలు
వెంకన్న కుటుంబానికి, అంబటి పరమేష్ కుటుంబానికి గతంలో వివాదాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు నాలుగేళ్ల క్రితం వెంకన్న కుమార్తెకు అంబటి వినయ్తో ప్రేమ వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయి విడాకులు తీసుకున్నారని తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో జరిగిన పంచాయతీలో కూడా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు వెల్లడించారు. ఆ సమయంలో పరమేష్ తన భర్తపై బ్లేడుతో దాడికి ప్రయత్నించాడని వెంకన్న భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పాత కక్షల నేపథ్యంలోనే వెంకన్నను పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
కేసు నమోదు.. దర్యాప్తు
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల అసలు కారణాలు, ఘటనలో అనుమానితుల పాత్ర, వెంకన్నను ఇంటి నుంచి తీసుకెళ్లిన ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్య వెనుక పాత కక్షలే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
also read : కేంద్ర క్యాబినెట్ విస్తరణ…!
