క్రైమ్ మిర్రర్ : పాఠశాలకు వెళ్తున్న సమయంలో వాగు దాటుతుండగా ఓ ఉపాధ్యాయురాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటన కర్లపొద గ్రామంలో చోటుచేసుకుంది. అయితే సమయానికి స్థానికులు స్పందించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కర్లపొద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎం. మణి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు పాఠశాలకు బయలుదేరిన ఆమె.. మార్గమధ్యలో ఉన్న వాగును దాటే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వరద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఆమె అదుపుతప్పి కొంతదూరం నీటిలో కొట్టుకుపోయారు.
ప్రవాహంలో వెళ్తున్న సమయంలో ఓ చెట్టు కొమ్మను పట్టుకుని సహాయం కోసం ఆమె కేకలు వేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఉపాధ్యాయురాలిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు, పాఠశాల సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
also read : మాజీ అధ్యక్షుడు అసద్కు డెత్ సెంటెన్స్.. కోర్టు సంచలన తీర్పు
