Homeతెలంగాణతెలంగాణ బిజెపిలో 'ధర్మపురి' అలజడి...!

తెలంగాణ బిజెపిలో ‘ధర్మపురి’ అలజడి…!

  • ఢిల్లీలో ఆత్మీయ సమావేశానికి దూరం

  • బండి సంజయ్ తో విభేదాలు కారణం

  • మిగిలిన నేతలంతా హాజరైనా.. ముఖం చాటేసిన నిజామాబాద్ ఎంపీ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బిజెపిలో విభేదాలు సమసి పోలేదా? ఇంకా నేతల మధ్య విభేదాలు అలానే ఉన్నాయా? ముఖ్యంగా బండి సంజయ్ తో ధర్మపురి అరవింద్ విభేదిస్తున్నారా? అందుకే మొన్నటి బండి నివాసంలో జరిగిన విందు సమావేశానికి అరవింద్ రాలేదా? తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ. బండి సంజయ్ నాయకత్వాన్ని అరవింద్ విభేదిస్తున్నందునే గైర్హాజరైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.

  • ఆత్మీయ విందు సమావేశం..

ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో తెలంగాణ బిజెపి ఎంపీలు, సీనియర్ నేతల మధ్య విందు సమావేశం జరిగింది. పార్టీ అంతర్గత విభేదాలను పక్కనపెట్టి.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సంస్థాగతంగా కమల దళాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఆత్మీయ కలక జరిగింది.

ఈ సమావేశానికి బిజెపి ఎంపీలంతా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ సైతం హాజరయ్యారు. బండి సంజయ్ తో తీవ్ర విభేదాలు ఉన్న ఈటెల రాజేందర్ కూడా హాజరయ్యారు. బండి సంజయ్ తో ఆత్మీయంగా కలిసి భోజనం చేశారు. టిడిపి శ్రేణుల్లో ఇది జోష్ నింపింది.

  • అందరు నేతలు హాజరు..

ఢిల్లీలో జరిగిన ఇంతటి ప్రాధాన్యత సమావేశానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గైర్హాజరయ్యారు. తెలంగాణ రాజకీయాలతో పాటు మీడియా వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రాష్ట్రంలోని మిగిలిన కీలక ఎంపీలు బండి సంజయ్ ఇంట్లో జరిగిన విందు సమావేశానికి హాజరుకాగా.. కేవలం అరవింద్ మాత్రం దూరం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పార్టీలో ఇంకా నేతల మధ్య గ్యాప్ ఉన్నట్లు స్పష్టం అవుతుంది. బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కొన్ని అంశాల విషయంలో ధర్మపురి అరవింద్ అతనితో విభేదించే వారట. కొన్నిసార్లు మీడియా ముందుకు వచ్చి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఢిల్లీలో మిగిలిన నేతలంతా ఐక్యతను చాటేందుకు బండి సంజయ్ ఇంట్లో భేటీకి వెళ్లారు.. అరవింద్ మాత్రం అందుబాటులోకి రాకపోవడం వెనుక ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయని అర్థమవుతోంది.

  • ముందస్తు కార్యక్రమాలవల్లట..

మరోవైపు ధర్మపురి అరవింద్ ఈ భేటీకి గైరహాజరవ్వడం వెనుక రకరకాల ప్రచారం జరుగుతోంది. ముందస్తు కార్యక్రమాల వల్లే ఆయన ఈ భేటీకి హాజరు కాలేకపోయారని.. ఇందులో ఏ రాజకీయము లేదని ఆయన అనుచరులు తేల్చి చెబుతున్నారు. గతంలో ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు అంతా కలిసి గ్రూప్ ఫోటోకు దిగిన సంగతి తెలిసిందే.

ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ టుగెదర్ నెస్ అని క్యాప్షన్ ఇచ్చారు ధర్మపురి అరవింద్. అయితే తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన ఈ సమావేశానికి మాత్రం ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. సోషల్ మీడియాలో సైతం స్కిప్ అని వేశారు.

బండి సంజయ్ ఈటెల రాజేందర్ తో తన విభేదాలు ముగించుకున్నారు కానీ.. ధర్మపురి అరవింద్ తో మాత్రం అలానే కొనసాగించేలా ఉన్నట్టు ఉన్నారు. మరి వీరి విషయంలో బిజెపి హై కమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు