సెలవుపై స్వగ్రామానికి బయలుదేరిన ఆర్మీ జవాన్ అదృశ్యం కావడం నెల్లూరు జిల్లాలో ఆందోళనకు దారితీసింది. వరికుంటపాడు మండలం తోటలచెరువుపల్లెకు చెందిన పగడాల రవి సుమారు 20 రోజులుగా కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆయన కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు.
మణిపూర్లో ఆర్మీ విధులు నిర్వహిస్తున్న రవి.. సెలవుపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన సమయంలో అదృశ్యమైనట్లు సమాచారం. జులై 19న భార్యతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఆయన ఫోన్కు సంబంధించి ఒడిశాలోని భద్రక్ వరకు సిగ్నల్ లభించినట్లు తెలిసింది.
అనంతరం రవి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా బెంగళూరు రైల్వే స్టేషన్లో ఆయనకు సంబంధించిన ఐడీ కార్డు లభించడం ఘటనపై మరింత ఉత్కంఠకు కారణమైంది.
రవి ఎక్కడికి వెళ్లారు? ఆయనకు ఏమైంది? బెంగళూరు రైల్వే స్టేషన్కు ఐడీ కార్డు ఎలా చేరింది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం రవి క్షేమంగా తిరిగి రావాలని ఆశిస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు వివిధ ప్రాంతాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
also read: మారేడుమిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని భార్యాభర్తలు మృతి
