క్రైమ్ మిర్రర్ : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ఉద్యమ సహచరుడు, ఆత్మీయ సోదరుడు, మంచి మనసున్న వ్యక్తిగా సుదర్శన్ రెడ్డి ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి వస్తారనే ఆశతో అందరం ఎదురుచూశామని, కానీ ఆయన ఇక లేరనే వార్తను జీర్ణించుకోవడం ఎంతో బాధాకరమని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన పోరాట యోధుడిగా, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిగా, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన సహచరుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. ఆయన లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ సమాజానికే తీరని లోటని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తాను ఒక ఉద్యమ సహచరుడిని, ఆత్మీయ సోదరుడిని కోల్పోయిన బాధలో ఉన్నానని తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని హరీశ్రావు తెలిపారు. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని కోరారు. చివరగా “పెద్ది అన్నకు జోహార్లు” అంటూ హరీశ్రావు ఘనంగా నివాళులర్పించారు.
also read : సీఎం రేవంత్ కు గ్రేటర్ కలవరం…!
