క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్లో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్పై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తన సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన యువతితో సదరు అధికారి పరిచయం పెంచుకుని, ఆ తర్వాత తనను మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ వ్యవహారంపై బాధితురాలు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ వద్దకు ఓ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో తనతో పరిచయం ఏర్పడిందని ఆమె పేర్కొంది. అనంతరం మాటలు కలిపి నమ్మకం పెంచుకుని, సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నారని ఆరోపించింది.
తనతో సంబంధం కొనసాగిన సమయంలో తాను గర్భవతిని అయ్యానని, విషయం బయటకు రాకుండా ఉండేందుకు తనపై ఒత్తిడి తెచ్చి అబార్షన్ చేయించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత కూడా తనను వివిధ రకాలుగా వేధింపులకు గురిచేశారని ఆరోపించింది.
అంతేకాకుండా, తన వ్యక్తిగత వీడియోలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డారని, వాటిని బయటపెడతానంటూ భయపెట్టి డబ్బులు డిమాండ్ చేశారని బాధితురాలు తెలిపింది. ఇప్పటివరకు తన నుంచి సుమారు రూ.2 కోట్లు వరకు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంకా వేధింపులు కొనసాగడంతో బాధితురాలు చివరకు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. డీజీపీ సీవీ ఆనంద్కు ఫిర్యాదు చేసి, తనకు న్యాయం చేయాలని కోరింది. ఫిర్యాదు అందుకున్న అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేసు దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.
also read : నిరసనల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. బలవంతపు చర్యలు వద్దని సూచన
