పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం మండలంలో రోడ్ల దుస్థితి ఎలా ఉందో బయటపడింది. ఉదయపురం పంచాయతీ పరిధిలోని అడ్వానంగూడ నుంచి సంజువాయి సెంటర్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల రహదారి పూర్తిగా బురదమయంగా మారి, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. వర్షాలు పడిన ప్రతిసారి ఈ మార్గం దాటడం ప్రమాదకరంగా మారుతుందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ గిరిజనుడు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. బురదతో నిండిపోయిన రహదారిలోనే పడుకుని తన అసహనాన్ని వ్యక్తం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. రోజువారీ అవసరాల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినా, ఈ దారిలో ప్రయాణించడం చాలా కష్టంగా మారిందని ప్రజలు వాపోతున్నారు.
ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న మండలంలోనే ఇలాంటి పరిస్థితి ఉండటం పట్ల గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి మరమ్మతులు త్వరగా చేపట్టాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా అంబులెన్స్ వంటి వాహనాలు ఈ దారిలో రాకపోవడం వల్ల ప్రాణాపాయం తలెత్తే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. రహదారి అభివృద్ధి పనులు చేపడితేనే గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని వారు అంటున్నారు.
also read: పురుషులను లక్ష్యంగా చేసుకున్న మహిళలు – ఇద్దరు అరెస్ట్
