భువనేశ్వర్, క్రైమ్మిర్రర్: ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దేంకానాల్ జిల్లా సదర్ ఠాణా పరిధిలోని మహిషాపుటా వద్ద గురువారం ఓ పెళ్లి బృందం కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. అయితే, అప్పటికే కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఊపిరాడక మృతి చెందారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరిని దేంకానాల్ ఆసుపత్రికి తరలించారు.
Also Read:నీట్ పేపర్ లీక్పై ప్రధాని కీలక ప్రకటన – ఫాస్ట్ట్రాక్ కోర్టులతో కఠిన చర్యలు!
మృతులు బంగురిసింగి గ్రామానికి చెందిన చంద్రకాంత్ స్వయిన్, అవినాష్ సాహు, అభిషేక్ సాహు, రాకేశ్ సాహు, రామ్ సాహులుగా గుర్తించారు. బుధవారం రాత్రి వీరు ఓ వివాహానికి హాజరై, స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు కేంఝర్ జిల్లాలో బుధవారం రాత్రి ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అస్వస్థతకు గురైన తమ కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.