హైదరాబాద్ నగర పరిధిలో మరోసారి మహిళల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన ఓ యువతిపై క్యాబ్ డ్రైవర్ దారుణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని తక్కువ సమయంలోనే అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధిత యువతి ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ఆన్లైన్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుంది. ప్రయాణం మధ్యలో డ్రైవర్ అనూహ్యంగా మార్గాన్ని మార్చి, వాహనాన్ని జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతానికి మళ్లించినట్లు తెలిసింది. అనంతరం వాహనం ఆపి బయటకు వెళ్లినట్టు నటించి, తిరిగి లోపలికి వచ్చి యువతిపై దాడి చేసినట్లు విచారణలో బయటపడింది.
ఈ ఘటన తర్వాత బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. గంటల వ్యవధిలోనే అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం.
నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతడిని జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
also read: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసు: పిటిషన్లో బయటపడ్డ సంచలన వివరాలు