క్రైమ్ మిర్రర్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అశ్వారావుపేట మండలంలో 16 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఓ దుకాణంలో పనిచేస్తున్న మైనర్ బాలిక ఆదివారం సాయంత్రం తన స్వగ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో తనను గ్రామం వద్ద దింపాలని పొరుగున ఉన్న మామిళ్లవారిగూడెం గ్రామానికి చెందిన కోర్స సంతోష్ను కోరింది.
బాధితురాలిని తీసుకెళ్తున్న సమయంలో మామిళ్లవారిగూడెం శివారు ప్రాంతానికి చేరుకున్న తర్వాత నిందితుడు బైక్ను మరో మార్గంలోకి మళ్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అక్కడే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. తర్వాత బాలికను ఆమె గ్రామంలో ఉన్న అన్న ఇంటి సమీపంలో దింపి నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇంటికి చేరుకున్న బాలిక తీవ్ర ఆందోళనతో ఏడుస్తుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు విషయం అడిగి తెలుసుకున్నారు. దీంతో తనకు జరిగిన ఘటనను బాలిక కుటుంబ సభ్యులకు వివరించింది.
బాధిత మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో కోర్స సంతోష్పై కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలికకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, కేసు దర్యాప్తులో భాగంగా సంబంధిత ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
also read : కూర నచ్చలేదని పోలీసులకు ఫోన్ చేసిన భర్త.. బదాయూంలో విచిత్ర ఘటన