క్రైం మిర్రర్ : కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హోటల్లో భోజనం చేస్తుండగా ఓ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన జుక్కల్ మండల పరిధిలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జుక్కల్ మండలం నాగుల్గావ్ గ్రామానికి చెందిన భీంరావు (35) ఉపాధి కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని పటాన్చెరులో నివాసం ఉంటూ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి స్వగ్రామానికి బయలుదేరిన ఆయన మార్గమధ్యలో పెద్దకొడపగల్లోని ఓ హోటల్లో భోజనం చేసేందుకు ఆగాడు.
భోజనం చేస్తుండగానే భీంరావుకు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థత కలిగి కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. అక్కడున్న వారు వెంటనే స్పందించి సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్స్ సిబ్బంది బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తూ మార్గమధ్యలో సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆస్పత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భీంరావు ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదఛాయలు అలుముకునేలా చేసింది. యువకుడు అనూహ్యంగా గుండెపోటుతో మృతి చెందడం స్థానికులను కలచివేసింది.
also read : మల్లారెడ్డి విషయంలో మౌనమేలా…?