రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. సరస్వతి మీనా అనే టీచర్ తనకు చెందిన రూ.500 నోటు కనిపించలేదని అనుమానంతో, విద్యార్థినులపై అనుచిత చర్యలకు దిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
ఆమె క్లాస్లోని బాలికలను ఒక్కొక్కరిని తనిఖీ చేయాలని నిర్ణయించి, దుస్తులు విప్పించాలని బలవంతం చేసినట్లు సమాచారం. దుస్తులు విప్పడానికి నిరాకరించిన వారికి రూ.500 చెల్లించాలని షరతు విధించినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనతో విద్యార్థినులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు.
ఇంటికి వెళ్లిన తర్వాత ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. వెంటనే ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై స్పందించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో, సంబంధిత టీచర్ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.
also read: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య… హృదయ విదారక ఘటన