-
మూఢనమ్మకాలతో ఒక కుటుంబం బలి..
-
బలవన్మరణానికి పాల్పడిన ముగ్గురు మహిళలు
Crime Mirror, Latest Updates: శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూఢనమ్మకాలు, కుటుంబ సమస్యలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజవర్గం జలుమూరు మండలం మర్రివలసకు ముద్ద దాలేప్పమ్మ (65), ఆమె పెద్ద కుమార్తె కొంగరాపు దాలమ్మ (45), వికలాంగురాలైన చిన్న కుమార్తె సరస్వతి (38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు నెలల కోసం ఇదే కుటుంబంలోని అప్పయ్య మృతి చెందాడు. అప్పయ్య చనిపోయిన తర్వాత నుంచి దెయ్యంగా మారి తమను వేధిస్తున్నాడు అంటూ వారంతా బయటకు చెబుతూ వచ్చారు.
ఈ క్రమంలోనే వారిని పలు అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. వీటినుంచి బయటపడేందుకు దాసురాళ్ల (నాటు వైద్యులు) చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో తాము పడుతున్న ఇబ్బందులకు ఇక పరిష్కారం లభించదు అని భావించిన ఈ ముగ్గురు శుక్రవారం సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గడ్డి మందు తాగిన వీరంతా అపస్మార్క స్థితికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు 108 వాహనానికి సమాచారాన్ని అందించి ఆసుపత్రికి తరలించారు. 108 వాహనం వచ్చేసరికి ముద్ద దాలేప్పమ్మ (65) మృతి చెందింది. మిగిలిన ఇద్దరూ శ్రీకాకుళం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాల కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
పిల్లలపై బెంగ పెట్టుకుని ఆత్మహత్యకు ప్రేరేపించిన తల్లి..
ఐదు నెలల కిందట ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న కొంగరాపు దాలమ్మ భర్త అప్పయ్య చనిపోయాడు. అప్పయ్య చనిపోయిన తర్వాత నుంచి వీరంతా మానసికంగా తీవ్రంగా కృంగిపోయారు. ఈ క్రమంలోనే పలు అపోహలకు, మూఢనమ్మకాలతో మరింత ఇబ్బందులను పడుతూ వచ్చారు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కనిపించకపోవడంతో చనిపోవాలని దాలేప్పమ్మ నిర్ణయించుకుంది.
అయితే తాను చనిపోయిన తర్వాత భర్తకు దూరమైన పెద్ద కుమార్తె, వికలాంగురాలైన చిన్న కుమార్తె భవిష్యత్తుపై తల్లికి బెంగ ఏర్పడింది. వారిని కూడా తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకుని వారికి కూడా గడ్డి మందు ఇచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు.
దీనిపై స్థానిక ఎస్ఐ అశోక్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వీఆర్వో దూసి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారా మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.