-
రెండో పెళ్లి చేసుకుంటే ఇక కష్టమే…!
-
అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం
Crime Mirror, Latest Updates: అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బహుభార్యత్వం విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే సంస్కృతికి వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. బహు భార్యత్వాన్ని అవలంభించే వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే అస్సా ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేసింది. బహు భార్యత్వాన్ని అవలంభించే వ్యక్తులకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడంతోపాటు ఈ తరహా చర్యలకు పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అస్సాం ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం పట్ల తాజాగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి జయంత మల్లా బారువా మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కేవలం అర్హులకు చేరడమే కాకుండా, సమాజంలో సమగ్రత, నైతిక విలువలను పెఒపందించేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
మహిళా సాధికారిత, లింగ న్యాయాన్ని పెంపొందించే ఉద్ధేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించారు. ఒకటి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే ఏ పురుషుడు కూడా ఇకపై అటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హుడు కాదని స్పష్టం చేశారు.
-
ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో..
ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్న తొలి రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఈ కొత్త విధానంలో భాగంగా అస్సాం సర్వీసెస్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్, 1964కు సవరణలు చేయాలని బడ్జెట్ ప్రతిపాదించింది. దీని ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకుంటే చట్ట ప్రకారం వారిని విధులు నుంచి తొలగిస్తారు.
అయితే, ఇదే విధానాన్ని సాధారణ పౌరులకు వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందించే ఉద్ధేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఏదైనా క్రిమినల్ చట్టం కింద నేరస్తుడిగా తేలిన వ్యక్తికి ప్రభుత్వ గుర్తింపు పొందిన సంక్షేమ పథకాలు ప్రయోజనాలను నిలిపేయాలని ఆర్థికశాఖ మంత్రి పతిపాదించారు. దీనిపై ప్రభుత్వం కూడా అధికారికంగా ఉత్తర్వులను విడుదల చేయనుంది. అయితే, దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ఆసక్తిగా మారింది.