కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు అర్బన్ జిల్లా అనేకల్ తాలూకాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
సమాచారం ప్రకారం, పాఠశాలలో పెన్ను మరియు కొద్దిపాటి డబ్బు (రూ.20, రూ.10) తీసుకుందని అనుమానిస్తూ ఉపాధ్యాయులు ఆమెను అందరి ముందూ ప్రశ్నించి మందలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
మరణానికి ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్లో, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అందరి ముందు అవమానించడం వల్ల తాను తీవ్రంగా బాధపడ్డానని పేర్కొంది. ఆ అవమానాన్ని భరించలేక ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. అంతేకాకుండా తన మరణానికి తన తల్లికి ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాఠశాల వర్గాల పాత్రపై కూడా విచారణ జరుగుతోంది. ఈ ఘటన విద్యార్థులపై మానసిక ఒత్తిడి, పాఠశాలల్లో శిక్షా విధానాలపై మరోసారి చర్చకు దారితీసింది.
also read: మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కొత్త మలుపు.. సుప్రీంకోర్టులో సోనమ్ రఘువంశీ పిటిషన్!