-
చివరి కోరిక తీర్చిన పవర్ స్టార్
-
గత నెలలోనే పరామర్శ
-
ఇంతలోనే విషాదం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగోటి నిరంజన్ మృతి చెందారు. వరంగల్ హనుమకొండలోని హనుమాన్ నగర్ కు చెందిన నిరంజన్ గత కొంతకాలంగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారు జామున హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.
పొనుగోటి రాము, మానస దంపతుల కుమారుడైన నిరంజన్ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఒక్కసారైనా తన అభిమాన హీరోను కలవాలని, మాట్లాడాలని అతడు కలలు కనేవాడు. నిరంజన్ పరిస్థితిని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ మానవత్వంతో స్పందించారు. గత నెల 17న స్వయంగా హనుమకొండకు వచ్చి నిరంజన్ ను పరామర్శించారు.
-
గత నెలలోనే పరామర్శ..
ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నా.. నిరంజన్ కోరిక మేరకు హనుమకొండ వచ్చి ఆప్యాయంగా హత్తుకున్నారు. ధైర్యం చెప్పారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అందించి.. సాలువ కప్పి ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల డైలాగులను నిరంజన్ అనుకరిస్తూ చేసిన వీడియోలను చూసి పవన్ ఎంతో ఆనందించారు.
అనంతరం జనసేన డైరీలో కూడా ఇలా రాశారు.. ప్రియమైన నిరంజన్ కు ప్రేమతో.. దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా అని రాసుకోచ్చారు. నిరంజన్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
-
పవన్ హామీ
మరోవైపు పవన్ కళ్యాణ్ నిరంజన్ కు ఒక హామీ ఇచ్చారు. త్వరలో ఓజి 2 సినిమాను మనిద్దరం కలిసి చూస్తామని.. సినిమా విడుదల అయితే నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని పవన్ కళ్యాణ్ నిరంజన్ కు మాట ఇచ్చారు. ఆ మాటతో నిరంజన్ ముఖంలో ఎక్కడ లేని ఆనందం కనిపించింది. అయితే వీధి వక్రించడంతో ఆ కల నెరవేరకుండానే నిరంజన్ చనిపోయాడు.
కండరాలకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు నిరంజన్. చివరకు కిడ్నీలు కూడా దెబ్బ తినడంతో చనిపోయాడు. నిరంజన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. హనుమకొండ లోని హనుమాన్ నగర్ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది.