Crime Mirror,Latest Updates: అయోధ్య రామ మందిర విరాళాల కేసులో వరుసుగా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. స్వామివారికి సమర్పించిన విరాళాలను దుర్వినియోగం చేసిన వ్యవహారంపై ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే విచారణ చేస్తున్న అధికారులకు కీలక విషయాలు తెలుస్తున్నాయి.
అయోధ్య రామ మందిర ట్రస్టుకు సంబంధించిన భూ కొనుగోళ్లపై తాజాగా సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఆలయానికి వచ్చిన కానుకల దుర్వినియోగ ఆరోపణలతో ప్రారంభమైన విచారణ ఇప్పుడు భూ లావాదేవీలు వరకు విస్తరించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సిట్ పదవీ కాలాన్ని కూడా విచారణ వేగవంతం చేసే ఉద్దేశంతో మరి కొంతకాలం పొడిగించారు.
ఇకపోతే ఈ కేసులో తాజాగా మరో కీలక విషయం బహిర్గతమైంది. ట్రస్టుకు సంబంధించిన నజూల్ భూమి లావాదేవీల్లో పాత్ర ఉన్నట్లు భావిస్తున్న మధ్యవర్తులు జాబితాను పోలీసులు సిద్ధం చేశారు. దర్యాప్తుకు పూర్తి సహకారాన్ని అందించాలని వారికి ఆదేశాలు జారీ చేయగా.. సహకరించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దర్యాప్తులో భాగంగా ట్రస్ట్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన రిజిస్ట్రీ పత్రాలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పలువురు సాక్షులను పిలిపించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే కీలకమైన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
-
ట్రస్ట్ తో సంబంధం ఉన్న వ్యక్తుల ఆస్తుల పరిశీలన..
తాజాగా నెలకొన్న ఆరోపణలు నేపథ్యంలో సిట్ అధికారులు లోతుగా దర్యాప్తును చేస్తున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామాలయానికి సంబంధించి ట్రస్టుతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆస్తుల వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయోధ్యతోపాటు లక్నో, నోయిడా, ఇతర రాష్ట్రాల్లోని ఆస్తులపై సమాచారం సేకరిస్తున్నారు.
దర్యాప్తులో అవకతవకలకు సంబంధించిన ఆధారాలు లభిస్తే ట్రస్ట్ కు చెందిన ప్రముఖులను కూడా విచారించే అవకాశం ఉందని అధికారుల చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది వ్యక్తులు ఈ సొమ్ముతో భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
అయితే ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులను గుర్తించే దిశగా అధికారులు విచారణ వేగవంతం చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.