Crime Mirror, AP State News: ప్రకాశం జిల్లా కంభంలో దారుణం శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడకక్కడే నలుగురు మృతిచెందగా, మరో 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. పెళ్లి ముహూర్తానికి కొద్దిసేపటి ముందే పెళ్లి బృందంపైకి లారీ వెళ్లడంతో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
దీంతో పెళ్లి జరగాల్సిన కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారుకు చెందిన పిల్లి బృందం ఖమ్మంలో జరగనున్న వివాహానికి బయలుదేరింది. ఉదయం 9:30 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా అంతకుముందు స్థానిక వినాయకుడి ఆలయం వద్ద పెళ్లికూతురుతో కొబ్బరికాయ కొట్టించే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు నిలబడి ఉన్నారు.
అదే సమయంలో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి నేరుగా బయట నిలబడిన వారిపై దూసుకునే వెళ్ళింది. ఈ క్రమంలోనే పెళ్లి బృందాన్ని ఢీ కొట్టిన అనంతరం లారీ మరో మూడు ద్విచక్ర వాహనాలు, రెండు బడ్డీ బంకులను కూడా ఢీకొట్టడంతో అక్కడ భయాందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది. లారీ ఢీకొట్టిన ఘటనలో ఆవుల అలకనంద (19), ఆవుల అంకాలు (20), ఆవుల నగేష్ (17), ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఆవుల నాగేశ్వరి అక్కడికక్కడే మృత్యువాత చెందారు.
ఈ ప్రమాదంలో పెళ్లికూతురు ఆవుల వేరక్క తీవ్రంగా గాయపడగా, మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు చేతగాత్రులను వెంటనే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
-
బీభత్సం సృష్టించిన లారీ.. అదుపులోకి డ్రైవర్
ఈ ప్రమాద ఘటన స్థానికంగా బీభత్సాన్ని సృష్టించింది. అత్యంత వేగంతో వచ్చిన లారీ ఎదురుగా ఉన్న వాహనాలను డీ కొట్టుకుంటూ బయోత్పాతాన్ని సృష్టిస్తూ ముందుకు సాగింది. అడ్డుగా ఉన్న వాహనాలను గుద్దుకుంటూ వెళ్లడంతో చుట్టుపక్కల ఉన్నవారు కేకలు, అరుపులు వేశారు. బయట ఉన్న మనుషులపై దూసుకుని వెళ్లడంతో అక్కడికక్కడే నలుగురు మృత్యువాత చెందారు.
మరికొంతమంది తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇకపోతే మృతి చెందిన వారిలో పెళ్లికూతురి ఇద్దరు సొంత అన్నలు, వదిన, మేనకోడలు ఉండడంతో కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది. పెళ్లి వేడుక జరగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకోవడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.
ఈ ప్రమాదానికి లారీ మితిమీరిన వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇది ఎలా ఉంటే పెళ్లి ఇంట విషాదాన్ని తీసుకువచ్చిన లారీ డ్రైవర్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధ్యత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.