క్రైమర్ మిర్రర్, జాతీయం:- తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందా.? అంటే తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఈ కుట్రకు సంబంధించిన కీలక విషయం వెలుగులోకి రావడంతో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో డీఎంకు చెందిన ముఖ్య నాయకుడు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. టీవీకే పార్టీకి చెందిన ఉత్తంగరై ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ ఇళయరాజాకు రూ.35 కోట్ల భారీ మొత్తాన్ని అందించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సదరు వ్యక్తి ఎమ్మెల్యేను సంప్రదించారు. ఇందుకు ప్రతి రూ.35 కోట్ల రూపాయలు అందిస్తామని ఆఫర్ చేశాడు. ఈ డీల్ చేసుకున్న వ్యక్తి తనను ఒక పొలిటికల్ సర్వే సంస్థకు చెందిన ప్రతినిధిగా పరిచయం చేసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఇళయరాజాను సంప్రదించిన ఆయన ఇప్పటికే 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టు పోలీసులు తాజాగా గుర్తించారు. ఈ ప్రలోభాల పర్వం వెనుక ఒక పెద్ద ముఠా కూడా ఉందని చెబుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం తమిళనాడులో సంచలనంగా మారింది.
డీఎంకే ముఖ్య నేతల ప్రమేయం..
ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారంలో డీఎంకే చెందిన ముఖ్య నాయకుల ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఇళయరాజాకు రూ.35 కోట్లు ఆఫర్ వెనుక డీఎంకే అగ్రనేత, మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ ఉన్నట్టు ఆరోపనలు వస్తున్నాయి. వారి కనుసన్నల్లోనే ఈ ఆపరేషన్ జరిగినట్టు నిఘా వర్గాల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇకపోతే, ఈ ఆఫర్ను తిరస్కరిస్తే ఎమ్యెల్యేను, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామని కూడా నిందితులు బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ బెదిరింపులు రావడంతోనే ఆయన చెన్నై పోలీస్ కమిషనర్ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బటయపడడడంతో తమిళనాడు రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.