సూపర్స్టార్ రజనీకాంత్ తో కలిసి నటించడం తన సినీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని ప్రముఖ నటి ఈశ్వరీ రావు తెలిపారు. దాదాపు 28 ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత ఆయనతో స్క్రీన్ను పంచుకునే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. 1990లో విడుదలైన ‘కవిదై పాడుమ్ అలైగల్’ సినిమాతో ఈశ్వరీ రావు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు బాలు మహేంద్ర తెరకెక్కించిన సినిమాలతో ఆమెకు మంచి పేరు వచ్చింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు 60కి పైగా సినిమాల్లో నటించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈశ్వరీ రావు, రజనీకాంత్తో కలిసి నటించాలన్న తన కోరిక గురించి వెల్లడించారు. బాలుమహేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘నీంగల్ కేట్టవై’ సినిమాలో తాను నటించాల్సి ఉందని, అయితే, కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం చేజారిపోయిందని చెప్పారు. అప్పటి నుంచే ఎప్పటికైనా రజనీకాంత్తో కలిసి నటించాలని భావించానని తెలిపారు. ఆ కోరిక చివరకు ‘కాలా’ సినిమా ద్వారా నెరవేరిందన్నారు. ఆ చిత్రంలో రజనీకాంత్ భార్య పాత్రలో నటించే అవకాశం రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. రజనీకాంత్తో కలిసి పని చేయడం తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని ఈశ్వరీ రావు పేర్కొన్నారు.