అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం సమీపంలోని ఓ రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అని పేరు పెట్టిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ విషయంపై తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఒక పోస్టు చేశారు. “ఈ గౌరవం పొందిన తొలి అమెరికా అధ్యక్షుడిని నేను. ధన్యవాదాలు భారత్” అని రాసుకొచ్చారు. ట్రంప్ పోస్టు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 23న హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమెరికా కాన్సులేట్ పక్కన ఉన్న రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేమ్ బోర్డును తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అమెరికా రాయబారి సెర్గియో గోర్ కలిసి ఆవిష్కరించారు.
ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ కార్యాలయాలు ఈ రహదారి సమీపంలోనే ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంతం హైదరాబాద్లో కీలక ఐటీ హబ్గా గుర్తింపు పొందింది. ఈ పేరు మార్పు భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. అలాగే ప్రపంచ సాంకేతిక కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని రహదారికి తన పేరు పెట్టడంపై ట్రంప్ స్పందిస్తూ భారత్కు ధన్యవాదాలు తెలపడం ఇప్పుడు రాజకీయ, దౌత్య వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.