క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) టైప్-2తో బాధపడుతున్న బేబీ ఆర్యాంశ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. చిన్నారికి ఉత్తమ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్యాంశ్ చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి సహాయం అందిస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన ఏడాది వయసున్న ఆర్యాంశ్.. ఎస్ఎమ్ఏ(SMA) టైప్తో బాధపడుతున్నాడు. చిన్నారి ప్రాణాలను కాపాడే ఇంజెక్షన్కు రూ.1.5 కోట్లు అవసరం. జూన్ 20 లోపు ఇంజెక్షన్ స్లాట్ను బుక్ చేసుకోవాలని, జూలై నెలాఖరులోగా చికిత్స పూర్తి చేయాలని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. దీంతో ప్రజల సహకారంతో ఇప్పటి వరకు రూ.75 లక్షలను తల్లిదండ్రులు సేకరించారు. మరో రూ.75 లక్షలు కావాల్సి ఉంది. దీంతో మిగిలిన నిధుల సమీకరణకు ప్రభుత్వ సహాయంపై చిన్నారి తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి, కావాల్సిన నిధులపై యూట్యూబర్ ఆదిరెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆదిరెడ్డి పోస్ట్కు సీఎం వెంటనే స్పందించారు. ‘చిన్నారికి ఉత్తమ చికిత్స అందేలా చేస్తాం. సీఎంఆర్ఎఫ్ అధికారులు చిన్నారి తల్లిదండ్రులను సంప్రదిస్తారు. ఆర్యాంశ్ పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు’ ఎక్స్లో రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. సీఎం ఆదేశాలతో సీఎంఆర్ఎఫ్ అధికారులు తక్షణమే చిన్నారి ఆర్యాంశ్ తల్లిదండ్రులను సంప్రదించనున్నారు.