క్రైమ్ మిర్రర్,తెలంగాణ :- హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా సైబర్ మోసగాళ్లు కొత్త పద్ధతిని అనుసరించి అమాయక నగరవాసులను లక్ష్యంగా చేసుకున్నారు. నగరంలోని వాటర్ బోర్డు అధికారుల పేరుతో నకిలీ సందేశాలు, కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.
వాటర్ మీటర్ పేరుతో మోసం
“మీ వాటర్ మీటర్ రీడింగ్ అప్డేట్ కాలేదు”, “మీ CAN నంబర్ ధృవీకరణ పెండింగ్లో ఉంది” వంటి సందేశాలతో ప్రజలను భయపెడుతున్నారు. వెంటనే స్పందించకపోతే నీటి కనెక్షన్ను పూర్తిగా నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ల ద్వారా కొన్ని లింకులను పంపిస్తూ, సమస్యను పరిష్కరించేందుకు తక్కువ మొత్తంలో చెల్లింపు చేయాలని నమ్మిస్తున్నారు.
నకిలీ యాప్లతో ఫోన్పై పూర్తి నియంత్రణ
బాధితులు ఆ లింకులపై క్లిక్ చేస్తే, వారి మొబైల్లో నకిలీ APK ఫైళ్లు లేదా రిమోట్ యాక్సెస్ యాప్లు ఇన్స్టాల్ అవుతాయి. వీటి ద్వారా మోసగాళ్లు ఫోన్ స్క్రీన్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటారు. తరువాత వీడియో కాల్స్ లేదా ఇతర మార్గాల్లో బ్యాంకింగ్ వివరాలను సేకరిస్తారు.
బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసే దందా
బాధితులు యూపీఐ పిన్లు, ఓటీపీలు లేదా ఇతర సున్నితమైన సమాచారం నమోదు చేసిన వెంటనే, మోసగాళ్లు వారి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బును తీయడం ప్రారంభిస్తారు. కొన్ని క్షణాల్లోనే ఖాతాలోని మొత్తం సొమ్మును దోచుకుంటున్నారు.
ప్రజలకు పోలీసుల హెచ్చరిక
ఈ తరహా మోసాలపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అధికారికంగా వచ్చిన సందేశాలు కానివి నమ్మకూడదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా అపరిచితులు పంపిన లింకులను ఓపెన్ చేయడం, తెలియని యాప్లను డౌన్లోడ్ చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
బ్యాంక్ ఓటీపీలు, పాస్వర్డ్లు, కార్డ్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్లకు స్పందించకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మోసానికి గురైనట్లు అనిపిస్తే వెంటనే మొబైల్ డేటాను ఆపి, అనుమానాస్పద యాప్లను తొలగించాలి.అదేవిధంగా వెంటనే బ్యాంక్ను సంప్రదించి ఖాతాను సురక్షితంగా మార్చుకోవాలి. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి 1930 హెల్ప్లైన్ను సంప్రదించడం లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయడం ద్వారా నష్టం తగ్గించుకోవచ్చు.సైబర్ నేరాలు మరింత తెలివిగా మారుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. చిన్న మొత్తాల పేరుతో వచ్చే సందేశాలు కూడా పెద్ద నష్టాలకు దారి తీసే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి.